ఖిల్లాఘణపురం, మే 8 : ఓట్ల కోసం కాకుండా భావితరాల భవిష్యత్ కోసం సాగు, తాగునీటి కొరత లేకుండా చేయడమే తన ప్రయత్నమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని దొంటికుంటతండాలో కాల్వ పనుల ప్రారంభోత్సవం, షాపూర్ తండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, కర్నెతండాలో గ్రామ పంచాయతీ భవనం, ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన, వెనక్కితండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, మామిడిమాడలో హెల్త్ సబ్సెంటర్, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన, మల్కిమియాన్పల్లిలో గ్రామ పంచాయతీ భవనం, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన, ఈర్లతండాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో కలిసి మంత్రి చేపట్టారు. అలాగే కర్నెతండా లిఫ్ట్ పనులను వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో బీఆర్ఎస్ పనిచేయడం లేదని, ఈ తరంతో పాటు భావితరాల భవిష్యత్కు బాటలు వేసేందుకు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొని అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి కర్నెతండా లిఫ్ట్ పనులకు రూ.76కోట్లతో ఎత్తిపోతల పథకం పనులను చేపట్టామన్నారు. కర్నెతండా ఎత్తిపోతల పథకానికి మోటార్లు, కరెంట్ పనులు మిగిలిపోయాయని, ఈ రెండు పూర్తయితే సాగునీరు రైతులకు అందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాల్వల నుంచి నీటిని రైతులు తీసుకునే అవకాశం లేదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకొని తెలంగాణలో ఆ నిబంధనను ఎత్తివేసినట్లు గుర్తుచేశారు. కర్నెతండా 550 అడుగుల ఎత్తైన ప్రదేశంలో ఉందని, దొంటికుంటతండా కాల్వ పనులు పూర్తయితే 500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి..
ప్రైవేట్ వైద్యానికి దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం అందుతుందన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలుగా సీఎం కేసీఆర్ పల్లెల అభివృద్ధ్దికి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. ప్రజా రవాణా సాఫీగా సాగేలా బీటీ రోడ్లను ఏర్పాటు చేసుకొంటున్నామని, పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.