ఖిల్లాఘణపురం, సెప్టెంబర్ 25 : నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి షాపూర్ ఊరంచుతండాలో పల్లెనిద్ర చేశారు. సోమవారం ఉదయం తండాలో మార్నింగ్ వాక్ చేస్తూ సీసీరోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు, దవాఖాన, ఇతర సమస్యలను తెలుసుకున్నారు. కొంతమంది వృద్ధులతో ముచ్చటించి వారి బాగోగులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తానన్నారు. తండాలో రూ.కోటీ 5లక్షలతో బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం షాఫుర్లో అనారోగ్యంతో బాధపడుతున్న మురళిని పరామర్శించి ఆయన కుటుంబసభ్యులకు రూ.15వేల ఆర్థికసాయం అందజేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు వాల్మీకి విగ్రహాం ఏర్పాటుకు రూ.లక్షకు గానూ రూ.50వేలు అక్కడిక్కడే ఇవ్వగా మిగతా డబ్బులు రెండు, మూడు రోజుల్లో అందజేస్తానని చెప్పారు. మండలకేంద్రానికి చెందిన నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆర్థిక, సామాజిక, రాజకీయాల్లో అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ.. దేశానికే ఆదర్శం
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపారని మంత్రి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. రోడ్డుమీదితండా అంగన్వాడీ బిల్డింగ్, ఫార్మేషన్ రోడ్డు, మొగులుకుంట తండా, తిరుమలాయపల్లి, కమాలుద్దీన్పూర్లో బీటీ రోడ్లు, ఆగారం బీటీ నుంచి గంగావానిగూడ వరకు, ఖిల్లా ఆర్అండ్బీ నుంచి ఫిరంఖాన్ చెరువుకు ఫార్మేషన్ రోడ్లు, ఘణపురం ఆర్అండ్బీ నుంచి ఘణపురం తండా వరకు, సూరాయపల్లి నుంచి తిమ్మాయిపల్లి తండా వరకు బీటీ రోడ్లు, పలు గ్రామాల్లో జీపీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, మానాజీపేటలో ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి, కొత్తపల్లితండాలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వెంకటాంపల్లిలో 24మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఖిల్లాఘణపురం బెస్తగేరిలో కమ్యూనిటీహాల్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు.
పల్లెల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయని, అందులో భాగంగానే ప్రతి పల్లెకు సాగునీటిని తీసుకొచ్చి బీడుభూములను సస్యశ్యామలం చేశామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నానన్నారు. ఎన్నికల వేళ కొంతమంది మాయమాటలు చెప్పి మందు, డబ్బు ఆశ చూపి మోసం చేయడానికి వస్తారని, వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పదేండ్లలో ఏ నాయకుడు చేయని అభివృద్ధిని తాను చేసి చూపించానన్నారు. మండల ప్రజలు గతంలో మాదిరిగానే కష్టపడి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఒక్కరోజు కష్టపడి పనిచేసి గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణానాయక్, సామ్యానాయక్, లక్ష్మారెడ్డి, మురళీధర్రెడ్డి, కృష్ణయ్య, రంగారెడ్డి, విక్రమ్, శ్యాసుందర్రెడ్డి, సత్యం, క్యామరాజు, పురుషోత్తం, సురేందర్, బాలాంజనేయులుగౌడ్, మన్నెంగౌడ్, లాలూనాయక్, బుచ్చిబాబుగౌడ్, రమేశ్, వేణుగోపాల్, సింగిల్విండో డైరెక్టర్లు తదితరులు ఉన్నారు.
30మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లోకి..
పెద్దమందడి, సెప్టెంబర్ 25 : మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ నాయకులు సోమవారం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సర్పంచ్ సువర్ణమ్మ, జగన్మోహన్రెడ్డి, లక్ష్మీకాంత్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ మంత్రి తమ గ్రామానికి సాగునీరు అందజేయడంతోపాటు ఎత్తు ప్రాంతాలకు మినీ లిఫ్ట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలును గ్రహించి తామంతా బీఆర్ఎస్ వెంటే ఉండాలని పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ నాయకులు బాల్రెడ్డి, వెంకట్రెడ్డి, రామచంద్రారెడ్డి, రవీందర్రెడ్డి తదితరులున్నారు.