మహబూబ్నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘జనహితమే మా అభిమతం.. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశాం.. నాడు వలసల గడ్డగా పేరున్న పాలమూరును నేడు పరిశ్రమలకు అడ్డాగా మార్చాం.. మైగ్రేషన్ స్థాయి నుంచి జిల్లాకే రివర్స్ వలసలొచ్చేలా చేశాం.. తెలంగాణ వచ్చినంక బతుకుచిత్రం మారింది’.. అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మహబూబ్నగర్లోని ఐటీ టవర్, శిల్పారామం, పట్టణంలోని జంక్షన్లను మ్ంరత్రి
శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం బాలుర కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చినంక పాలమూరులో ఏం మారిందో.. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాడు మైగ్రేషన్కు కేరాఫ్.. నేడు ఇరిగేషన్ అడ్డా అన్నారు. కృష్ణా, తుంగభద్రతో ఉమ్మడి జిల్లాకు జీవం పోశాం.. ఇదంతా సీఎం కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమైందన్నారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీతో సందర్శకుల తాకిడి పెరగనున్నదన్నారు.అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90 శాతం పూర్తయ్యాయని, ఈ ఏడాది అదనంగా పది లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. దివిటిపల్లి సమీపంలో రూ.40 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్, శిల్పారామం, జంగల్ సఫారీ, జంక్షన్ల ప్రారంభంతోపాటు అమరరాజా కంపెనీకి మంత్రి శ్రీనివాస్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్కు పాలమూరు అంటే అమితమైన ప్రేమ ఉన్నదని, సచివాలయం ప్రారంభించి కాలుపెట్టిన మరుసటి రోజే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తొలి సమీక్ష నిర్వహించినట్లు గుర్తు చేశారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరందనున్నదన్నారు. కోయిల్సాగర్ ఎత్తిపోతల పథకం కింద మరో 35 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతుందన్నారు. మిషన్ కాకతీయ కింద 1572 చెరువులు బాగు చేసుకున్నామన్నారు.
నెలకు రెండు సార్లు తాగునీళ్లు వచ్చే.. మహబూబ్నగర్ పట్టణంలో రూ.932 కోట్లతో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగునీరందిస్తున్నామన్నారు. మహబూబ్నగర్కు ఫ్యాక్టరీలు, కొలువులు వస్తున్నాయని, అంతేకాకుండా అభివృద్ధి పథంలో బ్రహ్మాండంగా దూసుకుపోతున్నామన్నారు. దివిటిపల్లికి వెళ్తుంటే ‘అన్నా.. 5,279 డబుల్ బెడ్రూం ఇండ్లు పేదవాళ్లకు ఇచ్చిన.. ఇంకో 3 వేల ఇండ్లు కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి’ అని మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారన్నారు. ఇంకా ఇండ్లు రాని వాళ్లు ఎవరైనా ఉంటే గృహలక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున ప్రతి ఒక్కరికీ రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. జిల్లాలో 2 లక్షల మంది రైతులకు 10 కిస్తుల్లో రూ.1,900 కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండేందుకు జిల్లాలో 3,653 మందికి రైతుబీమా కింద రూ.182 కోట్లు అందజేశామని వివరించారు. 2014కు ముందు 73 వేల మందికి పింఛన్లు ఇస్తే.. ఇవాళ 1.06 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీ, వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానతో వైద్య పరంగా పాలమూరు అభివృద్ధి చెందిందన్నారు.
ఆనాడు జడ్చర్ల నుంచి ఇరుకు రోడ్లల్లో పాలమూరుకు వచ్చేవారమని, నేడు అద్భుతమైన రోడ్ల మధ్య మొక్కలు స్వాగతం పలుకుతున్నాయన్నారు. జంక్షన్లు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారన్నారు. హైదరాబాద్లో మాత్రమే ఉన్న శిల్పారామాన్ని.. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. ఇది కాదా అభివృద్ధి.. ఇంతటి సుందరమైన దృశ్యాలు ఆ సన్నాసులకు కనపడ్తలేదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రోడ్లు, జంక్షన్లు, డ్రైనేజీలు, పచ్చదనానికి ఎంతో ఖర్చు చేస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రజలను అడిగారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కుకు హైదరాబాద్ నుంచి కూడా టూరిస్టులు వస్తున్నారన్నారు. జంగల్ సఫారీని కూడా ప్రారంభించామన్నారు.
అభివృద్ధి చేయాలన్న ఆలోచన గత పాలకులు తట్టలేదని.. ఇప్పుడు పనులు జరుగుతుంటే ఎప్పుడు అడ్డుకుందామా..? అని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలోఉన్న పాలమూరుకు.. నేడు జరిగిన అభివృద్ధి బేరీజు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, మహేశ్వర్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, జైపాల్యాదవ్, చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, చల్లా వెంకట్రాంరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు సాయిచంద్, ఇంతియాజ్, వాల్యానాయక్, జెడ్పీ చైర్పర్సన్లు వనజ, సరిత, స్వర్ణమ్మ, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్గౌడ్, గోపాల్యాదవ్, కొరమోని నర్సింహులు, చెరుకుపల్లి రాజేశ్వర్, గంజి వెంకన్న, కిశోర్ పాల్గొన్నారు.
చిల్లర మల్లర గాళ్లను పట్టించుకోవద్దు..
చిల్లరమల్లర గాళ్లు ఎంతోమంది వచ్చి ఏదేదో వాగుతుంటరు.. పట్టించుకోవద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరారు. 14 రోజులకోసారి నీళ్లిచ్చిన వాళ్లు వచ్చి.. రోజు నీళ్లు ఇచ్చే శ్రీనివాస్గౌడ్ను అంటే కోపం రాకుండా ఉంటదా? అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేవుడు మనిషిని పుట్టిస్తే.. మనం కులాన్ని పుట్టించుకున్నామని.. కులం కాదు గుణం ముఖ్యమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలతో కలిసి పోరాడిన చరిత్ర శ్రీనివాస్గౌడ్ది అని అన్నారు. కుల, మత పిచ్చిగాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. మన స్థాయిని దిగజార్చుకోరాదన్నారు.
పచ్చదనంతో కళకళలాడుతున్న పంటలు..
‘పల్లెపల్లెన పల్లెర్లు మొలిచే పాలమూరులోనా.. సేతానం ఏ డుందిరా.. సేలన్నీ బీళ్లాయేరా?’ అంటూ ఆనాడు పాలమూరు దుస్థితిపై కవులు పాటలు రాశారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశా రు. నేడు నీళ్లు లేని ఒక్క నియోజకవర్గం అయినా ఉందా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి చెందడం లేదు అనే సన్యాసులకు పాలమూరు అభివృద్ధే నిదర్శనమని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. గతంలో 15 లక్షల మంది వలసపోతుంటే ఇప్పుడు సీన్ మారిందన్నారు. ఇతర రాష్ర్టాల వాళ్లే పాలమూరుకు కూలీకి వస్తున్నారని.. ఇది కదా మార్పు అంటే అని తెలిపారు. బీళ్లన్నీ మాగాణాలుగా మారాయన్నారు. మండుటెండలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు.
రూ.కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రూ.వందల కోట్లతో నిర్మించిన అనేక అభవృద్ధి పథకాలను మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. రూ.40 కోట్లతో దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ టవర్ను ప్రారంభించడంతోపాటు అమరరాజా బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. పట్టణంలో రూ.13 కోట్లతో నిర్మించిన మినీ శిలారామం, రూ.48.99 కోట్ల వ్యయంతో చేపట్టిన నెక్లెస్రోడ్డు, ఐలాండ్ సుందరీకరణ పనులు, రూ.1.48 కోట్లతో అభివృద్ధి చేసిన వన్టౌన్ జంక్షన్, అంబేద్కర్, నేతాజీ చౌక్లను ప్రారంభించారు. మినీట్యాంక్ బండ్ వద్ద మురుగుకాల్వ పనులను పరిశీలించారు.
ఐదున్నర గంటలపాటు పర్యటన
మహబూబ్నగర్/టౌన్/అర్బన్/పాలమూరు, మే 6 : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్ జిల్లాలో ఐదున్నర గంటలపాటు పర్యటించారు. నిర్ధేశించిన సమయం ప్రకారం కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పర్యటన సాగిందిలా..