నారాయణపేట : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ( Narayanpet Medical College) ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు ( MBBS seats ) మాత్రమే ఉండటం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి ( Rajender Reddy ) అన్నారు.
తెలంగాణలోని ఇతర ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, నారాయణపేట మెడికల్ కళాశాలలో మాత్రం 50 సీట్లకే పరిమితం చేశారని ఆరోపించారు. దీంతో జిల్లాకు చెందిన పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నారాయణపేట జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడంతో ఇక్కడి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.