మన్యంకొండ దేవస్థానంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. శాంతానారాయణగౌడ్, లక్ష్మీవేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పెండ్లిండ్లు నిర్వహిస్తామన్నారు. మే 7వ తేదీన ముహూర్తం ఖరారు చేశామని, పేదింటి జంటలు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ మేరకు మన్యంకొండ ఆలయంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. 320 ఎకరాల్లో నందనవనాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అలివేలు మంగతాయారు ఆలయం వద్ద విశాలమైన స్థలంలో టెంపుల్ టూరిజంకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మహబూబ్నగర్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ దేవస్థానం వద్ద శాంతానారాయణగౌడ్, లక్ష్మీవేంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించాలని సంకల్పించినట్లు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. మే 7వ తేదీన వివాహాలకు ముహూర్తం ఖరారు చేశామన్నారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పేద జంటలకు వివాహాలు జరిపించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు మన్యంకొండ దేవస్థానంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు.
పేదింటి జంటలు ఏప్రిల్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, వాళ్లందరికీ పట్టువస్ర్తాలు, పెండ్లికి కావాల్సిన సామగ్రిని ఉచితంగా సమకూరుస్తామన్నారు. అవసరమైతే తన సతీమణితో కలిసి కన్యాదానం చేసేందుకైనా సిద్ధం గా ఉన్నామన్నారు. 100మందికి ఒకేసారి పెండ్లిండ్లు చేసేలా మన్యంకొండ ఆలయం వద్ద పెద్ద హాల్ నిర్మిస్తున్నామన్నారు. అలాగే ఏసీ కల్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెండ్లిండ్లు చేసుకున్న జంటలు వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని గుట్టపై ఒకరోజు ఉండేలా వసతులను తీర్చిదిద్దుతున్నామన్నారు. రూ.25 కోట్లతో నిత్యాన్నదాన సత్రం, 20 గదులతో వసతికేంద్రం, రూ.5 కోట్లతో ప్రసాదం కౌంటర్ను నిర్మిస్తున్నామన్నారు. సామూహిక వివాహాలను ప్రతి ఏటా నిర్విఘ్నంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది పాలమూరు జిల్లావ్యాప్తంగా, ఆ తర్వాత ఉమ్మడిజిల్లా, చివరగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు పెండ్లిండ్లు చేస్తామన్నారు.
320 ఎకరాల్లో నందనవనం
మన్యంకొండ ఆలయానికి 320 ఎకరాల భూమి ఉన్నదని, అందులో అద్భుతంగా నందనవనం తీర్చిదిద్దుతామన్నారు. తిరుపతి మాదిరిగా అభివృద్ధి చేస్తామన్నారు. గుట్టకింద ఉన్న అలివేలు మంగతాయారు ఆలయం వద్ద విశాలమైన స్థలంలో టెంపుల్ టూరిజంకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలి రోప్వే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని, మూడు మల్టీనేషనల్ కంపెనీలు టెండర్లు వేశాయని, త్వరలో వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. నేరుగా గర్భాలయం వరకు వెళ్లడానికి రోప్వే ఉపయోగపడుతుందన్నారు. కొండ మధ్య నుంచి లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ గంజి వెంకన్న, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ కిశోర్, బీఆర్ఎస్వీ నాయకుడు సుదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.