వనపర్తి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : వర్షాల ప్రభావం.. ప్రాజెక్టుల నుంచి నీటి సరఫరా బంద్ చేయడంతో జిల్లాలో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. గత మూడేండ్లపాటు వరుసగా భూగర్భజలాలు సమృద్ధిగా ఉండడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించారు. కాల్వల్లో నీళ్లు కూడా రెండు పంటలకు వానకాలం, యాసంగిల్లో తొణికిసలాడటంతో భూగర్భజలాల సమస్య తలెత్తలేదు. ప్రస్తుత ఏడాదిలో వర్షాభావ పరిస్థితులు భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. యాసంగిలో నాట్లు వేసుకుందామని సిద్ధం చేసుకున్న నారుమళ్లను సైతం భయంతో కొందరు వదిలేసుకుంటే, మరికొందరు ఇతరులకు అమ్ముకుంటున్నారు. ఏటా వరుసగా పంటలు పండించుకుం టూ వస్తున్న రైతాంగానికి ఈ ఏడాది యాసంగిలో భూగర్భజలాల సమ స్య ఇప్పుడే మొదలుకావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో వర్షపాతం నమోదులు ఆందోళన కల్గించేలా ఉన్నాయి. జిల్లాలోని 14 మండలాల్లోను ఆశాజనకమైన వర్షాలు లేవు. చిన్నంబావి, వీపనగండ్ల, ఆత్మకూరు, పాన్గల్ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. మిగిలిన 10మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇలా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండో పంటకు కాల్వ నీళ్లు వస్తాయనుకొని ఆశలు పెట్టుకున్న రైతాంగానికి పూర్తిగా బ్రేక్లు పడ్డాయి. క్రాప్ హాలీడే ఇచ్చినట్లుగానే సాగునీటి అధికారులు తేల్చేశారు. వానకాలం చేతికి వచ్చిన పంటలతో హుషారుగా ఉన్న రైతాంగానికి యాసంగిలో కాల్వల నీళ్లు రాకపోవడం నిరాశకు లోను చేసింది. గడిచిన నాలుగేండ్లలో తీవ్ర ఎండాకాలంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వరుసగా ఏడాదికి రెండు, మూడు పంటలు పండించిన అన్నదాతలు ఈ సారి ఒకే పంటకు పరిమితం కావాల్సి వస్తుంది. చెరువుల నీటి ఆధారం ఉన్న రైతులు మాత్రమే యాసంగిలో వరి వేసుకొనే అవకాశం ఉన్నది.
జిల్లాలో భూగర్భజల శాఖ పరిధిలో 30 ఆటోమెటిక్ ఫిజో మీటర్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారానే భూగర్భ జలనీటి మట్టాలను లెక్కిస్తారు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి ఈ కేంద్రాల ద్వారా హైదరాబాద్లోని సర్వర్స్కు ఆటోమెటిక్గా సమాచారం వెళ్తుంది. ఈ లెక్కను మూడు విధాలుగా పరిశీలన చేసి పరిగణలోకి తీసుకుంటారు. జిల్లాలో 2016నుంచి నీటిమట్టాల పరిస్థితి ఆశాజనకంగా కొనసాగుతూ వచ్చింది. ఈ ఏడాది జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతం 582.0 మిల్లి మీటర్లుంటే, 535.0 మిల్లిమీటర్ల వర్షపాతంగా నమోదైంది. ఈమేరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 8శాతం తక్కువగా నమోదైంది. వర్షాల సీజన్ బాగుంటే జూన్ నెల నుంచి నవంబర్ వరకు భూగర్భజలాల రీచార్జ్ సమృద్ధిగా ఉంటుంది. అయితే లోటు వర్షపాతం నమోదైన నాలుగు మండలాల్లో 20 నుంచి 59 శాతం లోటుగా ఉన్నట్లు తేలింది.
యాసంగిలో నాటు వేసుకుందామని రెండు ప్యా కెట్లు వరినారు పోసుకున్నా.. మా పొలాల వైపు భీ మా హైలెవల్ కెనాల్ ఉంది. కానీ వానకాలమే నీళ్లు రావు. యాసంగిలో కాల్వలకు నీళ్లు రావని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఉన్న బోర్లు కూడా నీళ్లు తగ్గుతున్నాయి. మాకు 5 ఎకరాల్లో మామిడితోట ఉంది. దానికి నీళ్ల ఎద్దడి వస్తే కష్టమని పోసిన వరినారును అమ్ముకున్నా.. కనీసం మా చెట్ల వరకైనా నీళ్లు సరిపోతే బాగుండు. బోర్లమీదనే ఆధారం. ఈ ఏడాది వర్షాలు లేనందున
రెండో పంటను వదులుకుంటున్నం.
జిల్లాలో భూగర్భజల మట్టాలు తగ్గుతున్నాయి. ఈసారి వర్షాలు అనుకున్నంత లేవు. నవంబర్ నెల నుంచే భూమిలో జలా లు తగ్గుతున్నాయి. ఇంకా మూడు నెలల వరకు అధికంగా తగ్గే అవకాశం ఉం ది. రైతులు ఎవరైనా యా సంగిలో వరి వేసేవాళ్లు ఎట్టిపరిస్థితుల్లో నూ వేయవద్దు. కనీసం ఆరుతడి ద్వారా ఏదైన పంటను సాగు చేసుకోవడం మంచిది. చివరకు నీళ్లు అందక, సరిపడక నష్టపోయేదానికంటే ముందే మేల్కొనండి. ప్రాజెక్టుల్లోనూ నీటి పరిస్థితులు ఆశాజనకంగా లేనందునా రైతులు గమనించి అర్థం చేసుకోవాలి.
బోరు బావుల్లో అప్పుడే నీరు తగ్గుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్ నెలలోనే బో ర్లు తక్కువ నీటిని పోయడంతో ప్రత్యామ్నాయాలను ఏ ర్పాటు చేసుకున్నారు. ఉన్న బోర్లల్లో లోతుగా మరికొన్ని పైపులు దింపి నీటిని తోడుకొనే ప్రయత్నాలు చేస్తున్నా రు. కాల్వ నీళ్లు.. చెరువుల్లో నీరున్న ప్రాంతాల్లో కొంత మేలుగా ఉన్నప్పటికీ నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో వేగం గా బోర్లు తగ్గుతున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కాల్వ నీటితో చెరువులు నిండి ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న బోర్లు కొంత మెరుగ్గానే ఉన్నాయి. నవంబర్ నెలలోనే బోర్లు తగ్గుమొఖం పడుతుంటే.. ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల వరకు భూగర్భజలాల పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా కాల్వల నీటి వసతి లేని ప్రాంతాల్లో మరింత వేగంగా బోర్లలో నీరు తగ్గిపోతోంది.