మహబూబ్నగర్, మే 22 : తాగునీటి గోస తీర్చేందుకే ప్రభుత్వం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని 3వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లోని మహిళలు గులాబీ పూలు చల్లుతూ మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఏనుగొండలో రూ.9.82లక్షలతో నిర్మించిన డ్వాక్రా భవనాన్ని, రూ.6లక్షలతో నిర్మించిన సీసీరోడ్డును మంత్రి ప్రారంభించారు. ఆయా సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. గతంలో పట్టణంలో రూ.200 పింఛన్ 7వేలమందికి మాత్రమే అందించే వారని.. నేడు 20వేల మందికి ప్రతి నెలా రూ.4కోట్లకు పైగా పింఛన్లు అందిస్తున్నామన్నారు. అనారోగ్యాకి గురైతే అందుబాటులో ఉంటూ ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటున్నామన్నారు. రూ.500కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తునామని.. మున్ముందు అన్ని జబ్బులకు ఇక్కడే సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నామని గుర్తు చేశారు.
అప్పన్నపల్లి వద్ద మొదటి బ్రిడ్జిని తక్కువ సమయంలో పూర్తి చేశామని.. రెండో బ్రిడ్జిని కూడా త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. పట్టణంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఇప్పుడు పాలమూరులో గల్లీకో పార్కు కనిపిస్తుందన్నారు. శిల్పారామం, మినీట్యాంక్బండ్, నెక్లెస్రోడ్డు, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కును పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేశామన్నారు. మన్యంకొండలో త్వరలోనే రోప్వేను ఏర్పాటు చేస్తామన్నారు. దివిటిపల్లి వద్ద ఐటీ పార్కును ఏర్పాటు చేసుకున్నామని, ఏడాదిలోపే 20వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. విద్యార్థుల కోసం 20 రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. సమాజంలోని అన్ని వర్గాల వారికి వసతులు కల్పించి బతుకుదెరువు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేకించి మహిళలకు బ్యాంకుల అనుసంధానంతో రూ.356కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. పట్టణ అభివృద్ధితో భూములు, ప్లాట్ల విలువ మరింత పెరిగిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రల్లో కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తుంటే ఓర్వలేకే అసత్య ఆరోపణలు చేస్తూ.. ప్రతిపక్షం పబ్బం గుడుపుకుంటున్నదని విమర్శించారు.
మంత్రి సమక్షంలో చేరికలు
ఏనుగొండలోని బీసీ కాలనీ లక్ష్మీనాయక్తండాకు చెందిన హరియాదవ్, బాలు యాదవ్, నరేశ్, మహేశ్, ఉదయ్, వెంకటేశ్, శివ, ప్రసాద్, నితిన్తోపాటు 50మందికి పైగా యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయాలనుకునే నేతలు బీఆర్ఎస్లోకి రావాలని ఆశిస్తారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఇతర పార్టీల్లో ఉంటూ ప్రజలకు మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటారన్నారు. అందరం సమిష్టిగా ఉంటూ ప్రజలకు మంచి చేస్తూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం తండాలో మరమ్మతు చేయించిన బోర్ను మంత్రి ప్రారంభించారు. అంతుకుముందు తండాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను మంత్రి ఎగురవేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ.నర్సింహులు, ముడా చైర్మన్ వెంకన్న, మార్కెట్కమిటీ చైర్మన్ రెహమాన్, కౌన్సిలర్లు కిశోర్, పెద్ద గొల్ల నర్సింహులుయాదవ్, నాగేశ్, గుమాల్ శ్రీను, పురుషోత్తం, గిరిధర్రెడ్డి, పర్వతాలుయాదవ్ తదితరులున్నారు.