వంట నూనెల లోటును పూడ్చేందుకు ప్రభుత్వం ఆయిల్పాం తోటలు సాగు చేయాలని సూచిస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాల తోటల సాగు క్రమక్రమంగా పెరుగుతున్నది. కేంద్రం వరి కొనుగోలు చేయమని ప్రకటించడంతో ఆ పంటకు బదులు ఆయిల్పాంను సాగు చేసేలా తెరపైకి తీసుకొచ్చింది. తోటల సాగుకు ఆసక్తి కనబర్చేలా కర్షకులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో వనపర్తి జల్లాలో 3 వేల ఎకరాల్లో సాగు లక్ష్యం నిర్దేశించారు. కడుకుంట్ల నర్సరీలో లక్షా 80 వేల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. సబ్సిడీ కింద రూ.20కే మొక్క అందజేస్తున్నారు. వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలకు సైతం ఈ నర్సరీ నుంచే మొక్కలను తీసుకెళ్తున్నారు. నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం ఉన్న రైతన్నలు ఆయిల్పాం తోటల సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
వనపర్తి రూరల్, జూన్ 19: ఆయిల్ పాం తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున సబ్సిడీ కింద మొక్కలను, డ్రిప్లను అందజేస్తున్నది. అందుకు జిల్లాలోని రైతులకు అందుబాటులో ఆయిల్ పాం మొక్కలను అందించేందుకు కడుకుంట్ల గ్రామంలో పెద్ద ఎత్తున్న జిల్లా ఉద్యాన,పట్టు పరిశ్రమల శాఖ సహకారంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కలను పెంచుతున్నారు. జిల్లాల్లో ఆయిల్ పాం సాగును మరింత విస్తరింపజేసేందుకు ప్రభుత్వ సూచనలతో అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
వచ్చే సీజన్లో 9వేల ఎకరాల్లో పంట సాగుకు ప్రభుత్వం అనుమతించగా, కలెక్టర్ల ఆదేశాలతో వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో ఆయిల్ పాం సాగును విస్తరింపచేసేలా ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ విజ్ఞాన యాత్రలను నిర్వహించారు. ఒక్కో జిల్లాలో 3వేల ఎకరాలకు తగ్గకుండా సాగు చేయించాలని నిర్ణయించగా.. ఇప్పటికే ఉద్యానశాఖకు రైతుల నుంచి 1057 దరఖాస్తులు అందాయి. అలాగే ఆయిల్ పాం సాగును ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేయాలని కలెక్టర్, వ్యవసాయశాఖ మంత్రి సూచించారు. ఆ దిశగా ప్రతి మండలంలోని రైతులకు ఆయిల్ పాం సాగు చేయించేలా కసరత్తు చేస్తున్నారు. పంట మార్పిడిపై ఆస్తకి ఉన్న రైతులను ఈ దిశగా ప్రోత్సహించాలని ఆధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
సన్నకారు,చిన్నకారు రైతులపై దృష్టి
గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉండి, ఐదెకరాల్లోపు భూమి కలిగిన రైతులకు ఆయిల్ పాం సాగులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. మూడేండ్ల పంట సాగుకాలానికి రూ.60వేల మేర సబ్సిడీలు అందుతాయి. ఐదెకరాలకు పైగా ఉన్న రైతులకు జాతీయ ఆహార నూనె గింజల పథకం కింద రూ.50వేల సబ్సిడీ అందనుండగా ఎస్సీ,ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై డ్రిప్ పరికారలను అందిస్తారు. ఇతర రైతులకు 90శాతం సబ్సిడీపై డ్రిప్ పరికరాలను అందించనున్నారు. కాగా జిల్లాలో నూతనంగా ఆయిల్ పాం సాగును తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.
వనపర్తిలో లక్షా 80వేల మొక్కలు సిద్ధం
జిల్లాలో ఆయిల్ పాం తోటలపై ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమల శాఖ సహకారంతో జిల్లాలోని భూములు ఆయిల్ పాం సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులతో పాటు సాగు చేస్తున్న ఇతర జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 853 మంది రైతులను కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలోని ఆయిల్ పాం సాగు క్షేత్ర సందర్శన, అవగాహన కల్పించేందుకు విజ్ఞాన యాత్రలను నిర్వహించారు.
ఇవీ చేయాల్సినవి..
ఆయిల్ పాం తోటలకు దరఖాస్తు చేసుకున్న రైతులు తమ పొలాలను చదును చేసుకొని ధీర్ఘ చతురస్రంలో కానీ త్రికోణ ఆకారంలో కానీ నచ్చిన పద్ధతిలో మార్కింగ్ చేసుకొని 2x 2 x 2 ఫీట్ గుంతలను తీసి సిద్ధం చేసుకోవాలి. రైతులకు ఒక్కో మొక్కకు రైతు వాటా కింద రూ.20/- ప్రభుత్వం నిర్ణయించింది. అని రైతు వాటాను DHSO, WANAPARTHY పేరు మీద డీడీ రూపంలో చెల్లించి మొక్కలు పొందాల్సి ఉంటుంది. మొక్కల సరఫరా నిమిత్తం లోడింగ్ ఖర్చు ఆయిల్ పాం కంపెనే భరించాలి. రవాణా, అన్లోడింగ్ ఖర్చు రైతు భరించాలని తెలిపారు.
డ్రిప్ సౌకర్యం కోసం మీ సేవలో ఆధార్కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కంపెనీ వారితో సర్వే చేయించి రైతు వాటా చెల్లించి అట్టి దరఖాస్తులను సంబంధిత ఉద్యాన శాఖ అధికారికి అందజేయాలి. సిద్ధమైన రైతులకు అర్హత ప్రతిపాదికన మొదటి దరఖాస్తు దారుడికి ప్రాధాన్యత క్రమంలో జూన్ మొదటి వారంలో మొక్కలు అందజేస్తారు. వ్యవసాయ విస్తరణ అధికారి నుంచి కూడా దరఖాస్తులు పొంది దరఖాస్తులో సూచించిన ప్రకారంగా డాక్యుమెంట్లు జతపర్చి నమోదు చేసుకోవాలి.
నీరు,విద్యుత్ ఉంటే సరి..
వ్యవసాయ క్షేత్రంలో నీటి సౌకర్యం, విద్యుత్తు మోటారు కలిగిన రైతులకు ఆయిల్ పాం సాగు చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆస్తకి ఉన్న రైతులు మొదట సూక్ష్మ సేద్యం (డ్రిప్) పరికరాలకు దరఖాస్తు చేసుకొని, పరికరాలు అందగానే ఉద్యాన శాఖ మొక్కలను సరఫరా చేస్తుంది. అనంతరం క్షేత్రం చుట్టా ఫెన్సింగ్ నిర్మించుకోవాలి. కాగా జూన్,జూలై నెలల్లో కడుకుంట్ల గ్రామంలో ఆయిల్ ఫెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీ నుంచి మొక్కలను అందిస్తారు.
ఆసక్తి పెంచుతున్నాం
ప్రభుత్వం ఆయిల్ పాం సాగుకు ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో రైతులు ముందుకొస్తున్నారు. కలెక్టర్, మంత్రి ఆదేశాలతో జిల్లాలో రైతులతో సాగు చేయించేలా ఆసక్తి పెంపొందిస్తున్నాం. ఇప్పటికే జిల్లాలోని రైతులు పంట సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 3వేలకు పైగా ఎకరాల్లో సిద్ధం చేశాం. మరో 3వేల ఎకరాలకు కూడా మొక్కలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– సురేశ్కుమార్, జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి, వనపర్తి
ఉద్యానశాఖ అధికారుల వివరాలు
క్షేత్రస్థాయిలో ఏరియా మేనేజర్
కరుణాకర్ : 9154864933
ఏరియా ఆఫీసర్ : 9154864930
కొత్తకోట, అమరచింత,ఆత్మకూర్,మదనాపూర్ మండలాలు: ఉద్యాన అధికారి ఎన్సురేశ్ : 7997725210
పెబ్బేర్, చిన్నంబావి, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, పానగల్ మడలాలు: అధికారి ఆర్.కృష్ణయ్య 7997725427
వనపర్తి, గోపాల్పేట్, ఘనపూర్, పెద్దమందడి, రేవల్లి మండలాలు: అధికారి శ్రీకాంత్ : 7997725428