కోస్గి, నవంబర్ 29 : కోస్గి పట్టణ ప్రజల చిరకాల వాంఛ టీఆర్ఎస్ సర్కార్ హయాంలో నెరవేరింది. ఎంతో మంది నాయకులు.., ఎన్నో ఏండ్లుగా కోస్గిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్పా ఆచరణలో పెట్టలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కోస్గి బల్దియాగా ఏర్పాటైంది. కొడంగల్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ తరపున పట్నం నరేందర్రెడ్డి గెలిచిన తరువాత రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో సుమారు రూ.50 కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కోస్గిలో బస్డిపో ఏర్పాటు కోసం 25 ఏండ్లుగా ప్రజలు ఎదురుచూశారు. ఇదిగో అదిగో అంటూ గత పాలకులు కాలయాపన చేశారు. నేడు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రూ.2 కోట్లతో డిపో నిర్మాణం చేపడుతున్నారు. రూ.20 కోట్లతో ప్రతి వార్డులో సీసీరోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తున్నారు. చాలీచాలని గ్రామపంచాయతీ భవనం ఉండగా, మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యాక రూ.1.2 కోట్లతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సర్వాంగ సుందరంగా చివరి మజిలీ (వైకుంఠధామం)ని రూ.1.2 కోట్లతో నిర్మించడంతోపాటు మున్సిపల్ పరిధిలో ఒక వైకుంఠరథాన్ని కూడా ఏర్పాటు చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం రూ.కోటితో బస్టాండ్ నిర్మించారు. సమీకృత మార్కెట్ లేక రోడ్లపై కూరగాయలు అమ్ముకుంటున్న విషయాన్ని గ్రహించి రూ.2 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. అలాగే రూ.60 లక్షలతో పంచతంత్ర పార్కు, మరో రూ.కోటితో గ్రంథాలయ భవనం ఏర్పాటు చేశారు. 50 పడకల ప్రభుత్వ దవాఖాన పనులు తుదిదశకు చేరుకున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన కోస్గి పట్టణం.. టీఆర్ఎస్ హయాంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నది.
మరింత అభివృద్ధి చేస్తా..
టీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే కోస్గి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. రూ.50 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాను. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో బల్దియాను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నా. మంత్రి కేటీఆర్తో మాట్లాడి మరో రూ.పది కోట్లను మంజూరు చేయిస్తా. డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషిచేస్తా.
– పట్నం నరేందర్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే