నారాయణపేట జెడ్పీ చైర్పర్సన్ వనజ
రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ
మక్తల్ టౌన్, జూన్ 16 : తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని జెడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పీఆర్జీ 176 రకానికి చెందిన ఎర్ర కంది విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వనజ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు అన్ని రకాల సదుపాయాలు సీఎం కేసీఆర్ కల్పించారని తెలిపారు. వానకాలం పంట సాగుకోసం జిల్లాలోని భూములు కంది, పత్తి, వరి సాగుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అందుకు అనుగుణంగా మన ప్రాంత రైతులకు కంది విత్తనాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
కంది, పత్తి పంటలు పండించడం వలన రైతులకు అధిక లాభం చేకూరుతుందని తెలిపారు. వానకాలం పంటలకు ముందు రైతులకు రైతుబంధు సాయంగా ఈ నెల 25 వరకు రైతుల ఖాతాలో ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున జమ అవుతాయని తెలిపారు. ఇప్పటికే ఎగువ ప్రాంతమైన కర్ణాటకలోని నారాయణపూర్ నుంచి నీరు విడుదల కావడంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి భీమా ఫేజ్ 1 ద్వారా స్టేజ్ 1,2 నుంచి చిట్టెం నర్సిరెడ్డి, భూత్పూర్ రిజర్వాయర్లు నింపుతున్నారని, దీంతో మక్తల్ నియోజక వర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందని తెలిపారు. వ్యవసాయ అధికారి మిథున్చక్రవర్తి మాట్లాడుతూ ఈ నెల 25వరకు రైతుబంధు ప్రతి రైతుకి అందుతుందని, ఒకవేళ రాని పక్షంలో 25 తర్వాత వ్యవసాయ కార్యాలయంలో తెలియజేయాలని తెలిపారు. పాలెంలో కొత్తగా అభివృద్ధి చేసిన కొత్త రకం కంది విత్తనాలను రైతులకు ఉచితంగా అందించినట్లు తెలిపారు. మక్తల్ మండలంలో 20,354 మందికి రైతుబంధు సాయంగా రూ. 33కోట్ల 50లక్షలు అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్గౌడ్, ఎంపీపీ వనజ, మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి మిథున్ చక్రవర్తి, సర్పంచ్ దత్తు, శేఖర్ రెడ్డి, శంషొద్దీన్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.