మహబూబ్నగర్ జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబంధు సాయంతోపాటు రైతు మొహంలో చిరునవ్వు మెరిసింది. మొన్నటి వరకు కరోనా కష్టకాలంలోనూ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి అండగా నిలబడిన సీఎం కేసీఆర్ మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమ చేస్తూ నేనున్నానంటూ మరోసారి భరోసానిచ్చారు. రైతుబంధు ప్రారంభం అయినప్పటి నుంచి నిరంతరాయంగా ఏడోసారి రైతుల ఖాతాల్లో పంట సాయం వచ్చింది. షావుకారుల వద్ద రైతులు మోకరిల్లకుండా దర్జాగా సాగుచేసేందుకు రైతుబంధుతో ముఖ్యమంత్రి భరోసానిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వానకాలం రైతుబంధు కోసం 9,47,260 మంది రైతులకు 24.63 లక్షల ఎకరాలకు గానూ రూ.1231.31 కోట్ల మేర రైతుబం ధు సాయం ఖాతాల్లో జమ చేయనున్నారు. మంగళవారం ఎకరా లోపు పొలం ఉన్న 2,06,495 రైతులకు రూ. 65.26 కోట్ల డబ్బులు జమయ్యాయి. కేవలం 10 రోజుల్లో అన్ని కేటగిరీల వారీగా రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కరోనా వల్ల ప్రపంచమే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా.. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం అన్నదాతకు అండగా నిలుస్తున్నది. వ్యవస్థలన్నీ కునారిల్లిన తరుణంలో దేశాలకు దేశాలే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇలాంటి సంకట స్థితిలోనూ తెలంగాణ సర్కార్ మాత్రం అ న్నదాత వెంటే నడుస్తోంది. రైతన్నకు చిన్న ఇబ్బంది లేకుండా చూస్తోంది. వానకాలం పెట్టుబడి నేరుగా ఖాతాల్లో జమ కావడంతో అన్నదాత ఆనందంగా ఉన్నాడు.
భూములకు విలువ పెరిగింది..
పదెకరాలు ఉంటే కేవలం 4, 5 ఎకరాలు సాగు చేసేటోళ్లు. చాలా మంది పొలాలు అమ్మెటోళ్లు. అప్పుడు భూములకు విలువ లేదు. రైతు అడ్డగోలుగా అమ్ముకోడు. తర్వాత బ్యాంకు లోన్లు, అప్పుల వాళ్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సాగు ప్రారంభించే సమయానికి రైతుబంధు వస్తున్నది. దీంతో అంతకు ముందు వ్యవసాయం చేసేందుకు ముందుకు రాని వాళ్లు సైతం ఇప్పుడు ఉత్సాహం చూపుతున్నారు. 2016 కంటే ముందు నారాయణపేటలో 3.50 లక్షల ఎకరాలు సాగయ్యేది. ఇప్పుడు 4.50 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. పడావు భూములను సైతం సాగులోకి తీసుకొస్తున్నారు. భూముల విలువ విపరీతంగా పెరిగింది. 2002లో నర్వ మండలంలో రూ.2 వేలకు ఎకరా అమ్ముకొనేందుకు ముందుకొస్తే కూడా కొనే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు అదే భూమి రూ.20 లక్షలకు చేరుకున్నది. నేను 20 ఏండ్లు పనిచేశాను. గతంలో వ్యవసాయాధికారిని ఎవరూ పెద్దగా పట్టించుకొనే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులే మా వద్దకే వచ్చి సలహాలు, సూచనలు అడుగుతున్నారు. గ్రామాల్లోకి వెళ్తే ఎంతో మర్యాద ఇస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, పథకాలు బాగా కలిసివస్తున్నాయి. భవిష్యత్తులో వ్యవసాయం ఇంకా బాగుంటుంది.
రైతును రాజు చేసిన సీఎం..
మా కుటుంబానికి 40 ఎకరాలు ఉన్నది. 15 ఎకరాల్లో నాటు వేశాం. మిగతా 25 ఎకరాల్లో వాణిజ్య పంటలు వేస్తున్నాం. గతంలో కరెంట్ సరిగ్గా లేక, నీళ్లు లేక సగం పొలం బీడు పెట్టేటోళ్లం. అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధుతో సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా నిలుస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతులకు వానకాలం పంట పెట్టుబడి ఇస్తున్నారు. సరైన సమయంలో వస్తున్న డబ్బులతో రైతులకు ఎంతో మేలవుతున్నది. నిరంతర విద్యుత్, సాగునీరు, గిట్టుబాటు ధరలతో రైతులకు అండగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే వ్యాపారులు రైతుల గొంతులు కోసేవాళ్లు. తెలంగాణ చరిత్రలో రైతులు ఇంత సంతోషంగా ఉన్న పరిస్థితి ఎన్నడూ లేదు. అయితే సీఎం కేసీఆర్ చెప్పినట్లు పంట మార్పిడి చేస్తేనే రైతులకు మరింత లాభం వస్తుంది. పార్టీలకతీతంగా అందరూ ముఖ్యమంత్రిని దేవుడిగా భావిస్తున్నారు.