మహబూబ్నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నాగర్కర్నూల్, ఫిబ్రవరి 25 : కుమ్మెర జాతరలో పసికందు మృతిపై కందనూలు కదం తొక్కింది. అభంశుభం తెలియని రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్లు వినిపించాయి. బుధవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి నేతృత్వంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాగర్కర్నూల్కు చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు చేస్తున్న న్యాయపోరాటానికి సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు.
కేటీఆర్ వస్తున్నాడని తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం హడావిడిగా 8 మంది నిందితుల్లో ముగ్గురిని ఎవరికీతెలియకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ప్రచారం చేశారు. అప్పటి వరకు కేసులు నమోదు చేయలేదని.. కోర్టు పర్మీషన్ కోసం వేచి చూస్తున్నామని.. పసిపాప పోస్టుమార్టం నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్న పోలీసులు అర్ధరాత్రి మీడియాకు కేసు వివరాలు తెలిపారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన పోలీసులు నిందితుల తరఫున కొమ్ము కాశారన్న ఆరోపణలు వినిపించాయి. బాధిత కు టుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని అంబేద్కర్ సాక్షిగా కేటీఆర్ పిలుపునిచ్చారు. కుటుంబాన్ని ఆదుకునే బాధ్యతను మర్రికి అప్పగించారు.
నాగర్కర్నూల్కు కేటీఆర్ వస్తుండడంతో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఓ వైపు అధికార పార్టీ, మరోవైపు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టినా బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు. కేటీఆర్ రాక గురించి తెలుసుకున్న పోలీస్లు ఇంటర్ పరీక్షలు నేపథ్యంలో 144 సెక్షన్లు అమలు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. కుమ్మెర ఘటనపై వాస్తవాలను వక్రీకరించి హడావుడిగా ఎస్పీ పత్రికా ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ నేతలు అన్ని అడ్డంకులు దాటుకొని కేటీఆర్ కార్యక్రమానికి తరలివచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డారు.

కుల వివక్షతతో అధికార పార్టీ నేతలు చేసిన పాశవిక దాడిని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటూ జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దీక్షలో కూర్చుని కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. అంతటితో ఆగకుండా అవసరమైతే శాసనసభ, శాసన మండలిలో ప్రభుత్వాన్ని గల్లా పట్టి న్యాయం కోసం నిలదీస్తామన్నారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిన పోలీసులు నిందితులకు మద్దతు ఇవ్వడం ఏమిటని నాగర్కర్నూల్ పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం చెందారు. బాధితులు న్యా యం కోసం పోలీస్స్టేషన్కి వెళ్తే అధికార పార్టీ నేతలకు పోలీసులే ఫోన్ చేసి కౌంటర్ కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చే జీతంతో పనిచేస్తూ బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి.. బదులుగా వారిపైనే కేసులు నమోదు చేస్తుంటే పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అర్థమవుతుందన్నారు. కుమ్మెర ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
కేటీఆర్ రాకతో కుమ్మెర బాధితుల్లో ఆశలు చిగురించాయి. ఐదు రోజులుగా బీఆర్ఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా, కుల సంఘాలు దీక్షలు చేస్తున్నాయి. అయినా అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు, బాధితులకు న్యాయం చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పోస్టుమార్టం నివేదిక, కోర్టు పర్మిషన్ అంటూ కాలయాపన చేస్తున్నది. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నా కనీసం వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించడం లేదు. హడావుడిగా ఘటనకు సంబంధం ఉన్న అసలు వ్యక్తులను కాదని.. వారు సూచించిన మిగతా ముగ్గురిని అదుపులోకి తీసుకొని..
అసలు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వారికి ముందస్తు బెయిల్ వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ఉండగా.. ఫలితంగా బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ చేసిన ప్రయత్నం ఫలించింది. కేటీఆర్ను తీసుకొచ్చి బాధిత కుటుంబానికి అండగా నిలిచేలా చేశారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పార్టీ పరంగా ఆదుకుంటామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పడంతో బాధితులకు కొండంత భరోసా వచ్చింది. ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగంలో కదలిక మొదలైంది.