కొల్లాపూర్, సెప్టెంబర్ 11 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నార్లాపూర్ లిఫ్ట్లో మొదటి పంప్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16వ తేదీన ప్రారంభించనున్నట్లు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దీంతో సుజల దృశ్యం ఆవిష్కృతం కానుందని ఆయన స్పష్టం చేశారు. కొల్లాపూర్లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు సంబంధించిన స్థలం, ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, ఐజీ షానవాజ్ ఖాసీం, కలెక్టర్ ఉదయ్కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని బొంగురాలమిట్ట (పీజీ కాలేజీ ప్రాంతంలో)ప్రదేశాన్ని సభాస్థలికి ఖరారు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల ఎన్నో ఏండ్ల కల ఫలించబోతున్నదన్నారు. ప్రపంచంలోనే అతి భారీ మోటర్లతో 300 మీటర్ల దిగువనున్న కృష్ణా జలాలను 687 మీటర్ల సముద్రమట్టానికి ఎత్తున పంపింగ్ చేయడం.. సాంకేతిక రంగంలో ఒక గొప్ప విజయంగా అభివర్ణించారు. ఈ విజయం తెలంగాణలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కృతం కావడం విశేషమని కొనియాడారు. సమైక్య పాలనలో కృష్ణానది పాలమూరు మీదుగా వెళ్తున్నా గుక్కెడు నీటికి ప్రజలు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు పనులను పూర్తి చేసుకొని కొంత ఉపశమనం పొందామన్నారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు తాగు, సాగునీరిచ్చి శాశ్వతంగా సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి పీఆర్ఎల్ఐకి శ్రీకారం చుట్టారన్నారు. ఐదు రిజర్వాయర్లు, 4 లిఫ్ట్ల ద్వారా ఈ పాజెక్టును చేపట్టామన్నారు. నార్లాపూర్ లిఫ్ట్ వద్ద రెండు మోటర్లు, ఏదుల వద్ద 4 మోటర్లు, వట్టెం రిజర్వాయర్ వద్ద 4 మోటర్లు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది అన్ని రిజర్వాయర్లలో నీటిని నింపి కాలువలు, ఫీడర్ చానెళ్లు పూర్తి చేస్తామన్నారు. ‘పాలమూరు’తో దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేయబోతున్నామని స్పష్టం చేశారు.
సమైక్య పాలనలో దత్తత పేరిట ఉమ్మడి పాలమూరు ప్రజలను దగా చేశారని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. పాలమూరు జిల్లా కరువును చూపించి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులు తెచ్చి సీమాంధ్రకు తరలించి మనకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. దీంతో 50 ఎకరాల భూమి ఉన్న రైతులతోపాటు కూలీలు కూడా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడ్, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడంతో రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైందన్నారు. కాళేశ్వరానికి మించిన బహుబలి మోటర్లతో పీఆర్ఎల్ఐని సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రతి గ్రామం నుంచి రైతులు, కూలీలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కాల్వలను కూడా వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. వలస జీవితాలకు స్వస్తి పలికేందుకు పాలమూరు ప్రాజెక్టు ఓ వరప్రదాయినిలా మారుతుందని మంత్రి తెలిపారు. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు రంగినేని అభిలాష్రావు, దూరెడ్డి రఘువర్ధన్రెడ్డి, ఎంపీపీ కమలేశ్వర్రావు, పోలీస్శాఖ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీలు మనోహర్, వెంకటేశ్వర్లు, నర్సింహ, సృజన ఉన్నారు.