కేంద్రం గ్యాస్ ధరలను పెంచడంతో ఉమ్మడి జిల్లా భగ్గుమన్నది. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీశ్రేణులు ధర్నాకు దిగాయి. వేలాదిగా మహిళలు గ్యాస్ సిలిండర్లతో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. మోదీ డౌన్.. డౌన్.. దేశ్కు బచావో.. బీజేపీకి హఠావో.. అంటూ నినదించారు. మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోడ్లపై కట్టెలు వెలిగించి వంటావార్పు చేపట్టి మధ్యాహ్న భోజనం అక్కడే చేశారు. పేటలో గ్యాస్బండపై ప్రధాని చిత్రపటాన్ని అంటించి ఆందోళనలో పాల్గొన్నారు. సిలిండర్ ధరల పెంపుతో ఇక కట్టెల పొయ్యే దిక్కని మహిళలు ఆక్రోశించారు. రాష్ట్రంలో కేసీఆర్ దేవుడిలా కాపాడుతుంటే కేంద్రంలోని మోదీ ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు జిల్లా హన్వాడలో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఆయా నియోజకవర్గాలు, పట్టణాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రం వంట గ్యాస్ ధరను అమాంతం పెంచడాన్ని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించాలని.. లేదా కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ గద్దెదిగాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది మహిళలు గ్యాస్ సిలిండర్లను రోడ్లపైకి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. మోదీ డౌన్.. డౌన్.. దేశ్కా బచావో.. బీజేపీకో హఠావో నినాదాలు మిన్నంటాయి. రహదారులపైనే కట్టెలను వెలిగించి వంటావార్పు చేశారు. అక్కడే భోజనం చేశారు. గ్యాస్ ధరలు పెరగడంతో ఇక కట్టెల పొయ్యే గతి అని మహిళలు ఆక్రోశం వ్యక్తం చేశారు. రూ.450 ఉండే గ్యాస్ ధర ఏకంగా రూ.1,250 పెంచడాన్ని తీవ్రంగా నిరసించారు. దీంతో తమ ఆమ్దాని అంతా గ్యాస్ బండకే సరిపోతుందని వాపోయారు. గతంలో ధర పెరిగినా సబ్సిడీ ఇచ్చే సర్కార్ దానికి తిలోదకాలు ఇవ్వడంతో పేదలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దేవుడిలా కాపాడుతుంటే కేంద్రంలోని మోదీ జేబులు గుల్ల చేస్తున్నారని విమర్శించారు.
నిరసనలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీగా నిరసనలకు దిగారు. మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం హన్వాడ మండలకేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొస్గి పట్టణంలోని శివాజీ చౌక్లో చేపట్టిన ధర్నాలో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పాల్గొని నిరసన తెలిపారు. మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్లతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో గ్యాస్బండపై మోదీ చిత్రపటాన్ని అంటించి భారీ ఎత్తున మహిళలతో నిరసన చేపట్టారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అయిజలో జరిగిన ఆందోళనలో పాల్గొనగా.. ఉండవెళ్లి మండల కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మ తగలబెట్టారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మహిళలతో కలిసి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొని కలెక్టరేట్ ఎదుట మహా ప్రదర్శన నిర్వహించారు. అచ్చంపేటలో విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిరసన కార్యక్రమం చేపట్టారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కొల్లాపూర్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసించారు. జడ్చర్లలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. వనపర్తిలో రాజీవ్చౌక్లో జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.