ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రిళ్లు దీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం వచ్చే నెల 23 వరకు కొనసాగనున్నది. ఈనెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాలు పూజలు, భక్తుల సందడితో కిటకిటలాడనున్నాయి. స్నానం, దానం, ఉపవాసాలకు ప్రత్యేకం కాగా.. నోములు, వ్రతాలకు ప్రాధాన్యత ఉన్నది. భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించుకునేందుకు ఉమ్మడి జిల్లా వాసులు సిద్ధమయ్యారు.
నాగర్కర్నూల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ)/బాలానగర్ : కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీమహావిష్ణువుకు సమానదేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు..’ సనాతన హిందూ ధర్మంలో కార్తీక మాసం విశిష్టత అర్థం చేసుకోవచ్చు. హైందవ మతంలో ఉత్తరాయణంలో మాఘ మాసం, దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్ట ఉంది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.
కార్తీకం తెలుగు మాసాల్లో చాలా ప్రత్యేకమైంది. దీన్ని ఆరోగ్య పరమైన మాసంగా, ప్రతిరోజూ పర్వదినంగా భావిస్తారు. పౌర్ణమి నాటి చంద్రుడు కృత్రిక నక్షత్రం సమీపంలో ఉడంటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసంగా పేరు వచ్చింది. నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయనున్నారు. ఊరూరా శివాలయాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రతి రోజూ ఉపవాసంతో పాటుగా దానాలు చేయడం రాత్రిళ్లు దీపాలు వెలిగించి శివున్ని పూజిస్తారు. అలాంటి పవిత్ర కార్తీక మాసం ఈ సంవత్సరం దీపావళి మరుసటి రోజున బుధవారం ప్రారంభం కాగా నవంబర్ 23న ముగియనున్నది. ఈనెల రోజులు అత్యంత విశిష్టత కలిగి ఉంటాయి. తెలుగు సంవత్సరంలో ఇది 8వ నెల. స్నానాలు, వ్రతాలకు శుభకరం. అయ్యప్ప దీక్ష కూడా ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. హరిహరులను ఇద్దరినీ పూజించడం జరుగుతుంది. ఈ మాసంలో నారాయణ, కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటారు. ఏదాదశి, ద్వాదశి సోమవారాలు, పౌర్ణమి సోమవారం రోజు నియమ నిష్టలతో ఉపసవాసం ఉండి 365ఒత్తులతో చేసే దీపారాధనతో పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. నువ్వుల నూనె దీపారాధనకు తప్ప ఏ అవసరాలకూ వాడకూడదు.
దీపారాధన
దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. ఒక్కరోజు దీపం వెలిగిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞానం అనే వెలుగులు నింపుకోవాలన్నదే దీపం ప్రత్యేకత. నలుగుతో స్నానం చేయరాదు. మహిళలకు ప్రత్యేకమైనదిగా కార్తీక మాసం నిలిచిపోతుంది. ఉసిరి చెట్టుకింద దీపాలను వెలిగించి పూజలు చేసుకుంటారు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది. సూర్యోదయం కంటే ముందుగా లేచి స్నానం చేయాలి. సోమవారాలు అత్యంత పవిత్రం. కనీసం సోమవారాలు పూజలు చేసినా ఫలం లభిస్తుంది. ఈసారి అక్టోబర్ 31, నవంబర్ 7న,14న, 21న నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి. శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్షకుంకుమార్చన జరిపిస్తారు.
ముఖ్యమైన తేదీలు
అక్టోబర్ 27న యమ ద్వితీయ భగినీ హస్త భోజనం, 28న నాగుల చవితి, చతుర్థి వ్రతం, 30న నాగుల పంచమి, సూర్యషష్ఠి, స్కంధ షష్ఠి, 31న మొదటి కార్తీక సోమవార వ్రతం, నవంబర్ 1న గోపాష్టమి, 2 అక్షయ నవమి, 4న కార్తీక ఏకాదశి(చిలుక ఏకాదశి), ప్రభోదిని ఏకాదశి, చాతుర్మాస్య వ్రత సమాప్తి, 5న చిలుక ద్వాదశి, 6న విశ్వేశ్వర వ్రతం, వైకుంఠ చతుర్ధశి, 7న కార్తీక జ్వాలాతోరణం, 8న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, చంద్రగ్రహణం ఉంటాయి. ఈ రోజు దేవాలయాలు మూసి ఉంటాయి. 7న కార్తీక పౌర్ణమి పూజలు, నవంబర్12న సంకష్ట హర చతుర్థి, 14 బాలుర దినోత్సవం(నెహ్రూ జయంతి), 20ఉత్పన్న ఏకాదశి, 21 ధన్వంతరి జయంతి, చివరి కార్తీక సోమవారం, 22న మాస శివరాత్రి, 23న సత్యసాయి బాబా జయంతి, కార్తీక అమావాస్య, 29న సుబ్రహ్మణ్య షష్టి, 30న కాలభైరవాష్టమి ముఖ్యమైన పండుగలు.
* మాసంలో చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటారు.
* తేలికైన ఆహారం భూజించడం
* ఉల్లి, వెల్లుల్లి తీసుకోవద్దు.
* పాలు, పండ్లు భుజించవచ్చు.
* రాత్రి భోజనం చేయకూడదు. అబద్ధాలు, దైవదూషణ చేయరాదు.
* అసత్యాలు మాట్లాడకూడదని, తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి.