మూసాపేట, జూన్ 27 : మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామంలో చీకటి దందా రోజు రోజుకు మితిమీరిపోతుంది. అక్రమార్కులు ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంపై మండలంలోని పలు సోషల్ మీడియాలో అధికారులకు నేరుగా ముడుపులు ముడుతున్నాయని, ఫిగర్తో పోస్టులు వస్తున్నా.. ఇసుక దందా మాత్రం ఆగడం లేదు. ఇసుక దందా ఆగకపోవడంతో ఆరోపణలలో నిజం ఉందని మండల ప్రజలు గుసగుసలాడుతున్నారు.
రాత్రి మొదలుకొని తెల్లవారుజాము వరకు జాతీయ రహదారిపై మినీ డీసీఎంలలో ఇసుక మోత మోగుతుంది. గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి గ్రామస్తులు సమాచారం అందిస్తే వారు వివరాలు నేరుగా ఇసుక మాఫియాకు అందజేస్తున్నారని, ఇసుక మాఫియా వారితో గొడవకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వార్తలు వచ్చినప్పుడు అధికారులు కంటి తుడుపు చర్యగా కొన్ని వాహనాలను పట్టుకొని నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తూ ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అండగా నిలుస్తున్నారని మండల ప్రజలు ఆరోపణచేస్తున్నారు.
కొంతకాలం కిందట ఇసుక మాఫియా అర్ధరాత్రి సమయంలో ఒకటి, రెండు వాహనాలలో నేరుగా వాగులోకి వెళ్లి ఇసుక అక్రమంగా తరలించేవారు. కానీ ప్రస్తుతం కొంతమంది అధికారుల అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. అధికారుల అండతో పగటి పూట వాగులో నుంచి ఇసుక తీసుకొచ్చి వ్యవసాయ పొలాల్లో డంప్గా నిల్వ చేస్తున్నారు. రాత్రి సమయంలో ఆ డంప్ల నుంచి ఇసుకను టిప్పర్లు, మినీ డీసీఎంల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారు. అక్రమ దందానే ఇంత బహిరంగంగా చేయడంతో అధికాలకు మామ్ముళ్ల మరకలు అంటుకుంటున్నాయి.
కొంత మంది అధికారులు నేరుగా ఇసుక మాఫియాతో వాహనం లెక్కన నెలకు రూ. 25వేల వరకు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. విషయం తెలిసినా కొంత మంది అధికారులు మాత్రం మనకెందుకులే ఈ వ్యవహారం అని నిమ్మకునిరేత్తినట్లు ఉండడంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఈ విషయంపై ఉన్నతాధికారులు అయినా కలుగజేసుకొని ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధర ఇసుక అందించాలని మన ఇసుక వాహనం పేరుతో ఆన్లైన్ ఇసుకను అందిస్తున్నారు. ఈ విధంగా ఇసుక తరలింపు చేయడం వల్ల ప్రభుత్వానికి క్యూ బిక్ మీటర్ లెక్కన డబ్బులు చెల్లిస్తారు. అ డబ్బులతో ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతోపాటు ఆ గ్రామ పంచాయతీకి కూడా నిధులు వస్తా యి. కానీ ప్రభుత్వానికి వెళ్తే మనకేం వస్తుందని అధికారులు ఇసుక అక్రమ రవాణాను పెంచి పోషిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ ఇసుక అక్రమ రవాణా మాత్రం అగడం లేదు. మరి ఇప్పటికైనా మండల అధికారులు పట్టించుకొని ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేస్తారా.. లేదా మాముళ్ల మత్తులోనే కొనసాగుతారా అనేది వేచి చూద్దాం..