..బాబోయ్ వేలకు వేలు ఎలా చలానాలు కట్టాలా.. అని ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి వాహనదారుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ట్రాఫిక్ నిబంధనల ఉ ల్లంఘనకుగానూ పెండింగ్ చలానాలు సులువుగా చెల్లించేలా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ద్విచక్ర వాహనాలకు 80 శాతం, ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లకు 90 శాతం రాయితీ ఇచ్చింది. భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించింది. 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చెల్లింపులు చేసుకోవాలని సూచించింది. దీంతో వాహనదారుల్లో సంతోషం వ్యక్తమవుతున్నది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో పోలీసులకు చిక్కిన వాహనదారులకు చలానా చెల్లింపులను సులభతరం చేసింది. బైకులు, కార్లు, ఆటోలు, ఇతర భారీ వాహనాలపై పడిన చలానాలను భారీ డిస్కౌంట్తో చెల్లించేందుకు రవాణాశాఖ అవకాశం కల్పించింది. ఈనెల 26నుంచి జనవరి 10వ తేదీ వరకు చలానాలు చెల్లించవచ్చు. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించకపోవడం, నో పార్కింగ్ ప్లేస్లో వాహనం నిలపడం, లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేయడం, మద్యంతాగి డ్రైవింగ్ చేయడం, ఆర్సీ, బీమాలాంటి పత్రాలు కలిగి ఉండకపోవడం, మైనర్లు నడపడం, అతివేగంలాంటి కారణాలతో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారు. రోడ్లపై ఇష్టారాజ్యంగా వాహనాలను నడపకుండా, నిలుపకుండా, డ్రైవింగ్తో ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు, ట్రాఫిక్ పోలీసులు పట్టణాలు, గ్రామాల్లోనూ కూడళ్ల వద్ద, శివార్లలో గస్తీ నిర్వహిస్తూ వస్తున్నారు. ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే అతడితో పాటుగా వాహనంలో ఉన్న, సంబంధం లేని ఇతర వాహనదారులు, ప్రజలు కూడా బాధితులుగా మారుతున్నారు. చాలా మంది క్షతగాత్రులు కావడంతో పాటుగా మృత్యువాత సైతం పడుతున్నారు. వాహనదారులు ఈ బాధ్యతలను గుర్తించడం కోసమే పోలీసుశాఖ చలానాలు విధిస్తోంది. అయినా చాలా మంది బాధ్యతా రాహిత్యంగా వాహనాలు నడుపుతూ పోలీసుల కెమెరా కంటికి చిక్కుతున్నారు. దీంతో వాహనదారులు తమ వాహనాలతో రోడ్లపైకి వచ్చేటప్పుడు పాత జరిమానాలకు భయపడుతూ వస్తున్నారు. పాత చలానాలు చెల్లించకపోగా కొత్తగా పడే చలానాలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఇలా గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు.
ఇందులో అధికశాతం ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లుగా అంచనా. గతంలో కేసీఆర్ సర్కారు ఈ పెండింగ్ చలానాలపై రాయితీ ప్రకటించింది. దీంతో నెలన్నరలో రూ.300 కోట్ల మేర చలానాలు వసూలవ్వడం గమనార్హం. గతంలో బైక్లపై 75శాతం, ఇతర వాహనాలకు 50శాతం రాయితీ ఇవ్వగా ఈసారి డిస్కౌంట్ను మరింత పెంచడం గమనార్హం. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90శాతం, బైకులపై 80శాతం, ఆటోలు, కార్లపై 60శాతం, భారీ వాహనాలపై 50శాతం మేర డిస్కౌంట్ ఇస్తూ చలానాలు చెల్లించేలా నిర్ణయించింది. దీని ప్రకారం చూస్తే.. ఒక బైక్కు రూ.1000 చలా నా ఉంటే రూ.200వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆటోలు, కార్లపై 60 శాతం రాయితీ ఉండగా ఒక్క వాహనానికి రూ.1000వరకు చలానా ఉంటే రూ.400, భారీ వాహనాలకు రూ.1000 ఉంటే రూ.500మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. బైక్లపై రూ.3వేలు పెండింగ్ చలానా ఉంటే రూ.600, ఫోర్ వీర్లపై రూ.3వేలు ఉంటే రూ.1200 వరకు మాత్రమే చెల్లించాల్సి వస్తుంది. తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలానాలను ఈనెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు మీ సేవా కేంద్రాలతోపాటు ఆన్లైన్లోనూ చెల్లించే అవకాశం ఉంది. రవాణా శాఖ వద్ద నమోదైన గణాంకాల ప్రకారం నాగర్కర్నూల్ జిల్లాలో 10వేల కార్లు, 70వేల బైకులు, 6వేల ఆటోలు, 5వేలు భారీ వాహనాలు ఉన్నాయి. ఇందులో చలానాలు పడిన వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పోలీసు శాఖ సూచిస్తోంది.
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నిర్దేశించిన రాయితీ మేరకు చలానాలు చెల్లించాలి. వాహనదారులు ఈనెల 26వ తేదీ నుంచి ఆన్లైన్, మీ సేవ కేంద్రాల ద్వారా చలానాలు కట్టాలి. ఆ తర్వాత ఈ అవకాశం ఉండదు. ఎక్కడైనా మళ్లీ పట్టుబడితే రెట్టింపు చలానాలు పడే అవకాశం ఉంటుంది. నెంబర్ ప్లేట్లు లేని వాహనదారులు తప్పకుండా వాహనాలపై నెంబర్లు రాయించుకోవాలి. దీనిపై జిల్లాలో ప్రత్యేకంగా దృష్టి సారించాం.
నారాయణపేట జిల్లాలో ఇప్పటివరకు పెండింగ్ చలాన్లు 1,80,632 ఉండగా.. వీటిపై రూ.9,28,62,375 జరిమానా ఉన్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 76,555 చలాన్లు ఉండగా.. వీటిపై రూ.5,50,55,270 ఫైన్ ఉన్నది.
వనపర్తి జిల్లాలో 2,58,207 చలాన్లు ఉండగా.. వీటిపై రూ.15,41,55,245 ఫైన్ ఉన్నది.
మహబూబ్నగర్ జిల్లాలో 1,99,841 చలాన్లు ఉండగా.. వీటిపై రూ.9,36,67,245 ఫైన్ ఉన్నది.
నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పటివరకు పెండింగ్ చలాన్లు 2,18,958 ఉండగా.. వీటిపై రూ.10,09,75,785 జరిమానా ఉన్నది.