జన నేత రాకతో ఉమ్మడి జిల్లా పావనం కానున్నది. బుధవారం పాలమూరు, కోస్గిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ప్రచార సభలు గ్రాండ్ సక్సెస్ కాగా.. చివరి మీటింగ్ను అట్టహాసంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్లాన్ చేశాయి. భారీగా జన సమీకరణలో నేతలు తలమునకలయ్యారు. రెండు పట్టణాలు గులాబీమయంగా మారాయి. మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్ సెగ్మెంట్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఎన్నికల బరిలో ఉండగా.. ఈ గడ్డపై నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
మహబూబ్గర్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తున్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రాతినిథ్యం వహిస్తున్న మహబూబ్నగర్తోపాటు నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కోస్గిలో సభ నిర్వహించడం.. ఈ సెగ్మెంట్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోటీ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. రెండు సభల కోసం మంత్రులు శ్రీనివాస్గౌడ్, మహేందర్రెడ్డి రెండ్రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ముఖ్యఘట్టమైన ప్రచారం చివరి దశకు చేరడంతో గులాబీ దళపతి పాల్గొంటున్న ప్రజా ఆశీర్వాద సభలు కాక రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 11 నియోజకవర్గాల్లో అధినేత విస్తృతంగా పర్యటించారు.
నేటి పర్యటన నేపథ్యంలో రెండు ప్రాంతాలు గులాబీమయంగా మారాయి. కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు గులాబీశ్రేణులు సన్నాహాలు చేపట్టారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలను, ప్రజలను భారీగా తరలించేలా పక్కా ప్లాన్ చేశారు. పాలమూరులోని బాయ్స్ కాలేజీ మైదానంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఇదే వేదికగా జరిగిన సభలో సీఎం కేసీఆర్ ఈసారి శ్రీనివాస్గౌడ్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పిన విధంగానే భారీ మెజార్టీతో గెలుపొందిన శ్రీనన్నకు అధినేత అమాత్య పదవి కట్టబెట్టి కానుకగా అందించారు. అంతటితో ఆగకుండా కీలకమైన శాఖలను అప్పగించారు. తర్వాత ప్రభుత్వంలో ఆయన కీలకంగా మారిపోయారు. ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలోనే తొలిసారిగా కేసీఆర్ అర్బన్ పార్కును పార్టీ అధినేత పేరుపై ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కూడా కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్గా నామకరణం చేసి సంచలనానికి దారి తీశారు. కొడంగల్లో రేవంత్ను తొడగొట్టి ఓడించిన పట్నం మహేందర్రెడ్డిని ఈ ఏడాది చివర్లో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో కోస్గిలో ఏర్పాటు చేసే ప్రజా ఆశీర్వాద సభ కూడా కీలకంగా మారింది.
కొడంగల్ నియోజకవర్గం రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని ఘోరంగా ఓడించిన పట్నం నరేందర్రెడ్డికే మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పోటీలో నిలబెట్టింది. అంతేకాకుండా రేవంత్ ఈసారి ఎలాగైనా ఓడించాలని పట్నం సోదరులు కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ముందే ఓటమిని ఊహించిన రేవంత్ ఏకంగా కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి బరిలో నిల్చొని అక్కడ కూడా ఓటమిని మూటగట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు.. దీంతో కోస్గిలో జరిగే ఎన్నికల ప్రచార తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రం మొత్తం ఇక్కడ జరిగే సభా వేదికపై మాట్లాడే ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించబోతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది. అట్టహాసంగా నిర్వహించేందుకుగానూ భారీ జన సమీకరణను చేసి సత్తా చాటే ప్రయత్నంలో పట్నం సోదరులు నిమగ్నమయ్యారు. నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున సమీకరించేందుకు ఇప్పటికే కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల కోస్గిలో జరిగిన సభలో రేవంత్ చీప్ కామెంట్లు చేయడం.. ఆ తర్వాత జనం రాక కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకున్న విషయం తెలిసిందే.. ఓటమిని ముందే గ్రహించిన ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ నేతలను కొనుగోలు చేసే ప్రయత్నంలో పడి విఫలం కూడా అయ్యారు. ఇంత తక్కువ జనం వస్తే రేవంత్ ఎలా గెలుస్తాడని హస్తం పార్టీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ చేపట్టే ప్రజా ఆశీర్వాద సభకు మంత్రి దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాలమూరు పట్టణమంతా గులాబీ మయంగా మారింది. 2018లోనూ ఇదే మైదానంలో ఎన్నికల సభ నిర్వహించి మంత్రి శ్రీనివాస్గౌడ్ ఘన విజయం సాధించగా.. సెంటిమెంట్ మేరకు మళ్లీ అక్కడే సీఎం కేసీఆర్ సభను నిర్వహిస్తున్నారు. భారీగా జన సమీకరణ చేసేందుకు పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. బహిరంగ సభకు వెళ్లే దారి మొత్తం గులాబీమయంగా మారింది. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి.