అయిజ, మే 1 : భానుడు భగ భగ మండుతున్నాడు. ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. 40 నుంచి 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు రాలేనంతగా ఎండ మండిపోతోంది. ఎండలు రోజు రోజుకూ ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వారం రోజులుగా ఎండ మరింత ముదిరింది. 41నుంచి 43 డిగ్రీలుగా నమోదవుతోంది.
ఎన్నడూ లేనంతగా ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడి పోతున్నారు. ఎండల తీవ్రతకు తోడు ఉక్కపోత తోడు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయిజ పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎండలు మండిపోతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వ్యవసాయ రైతులు, కూలీలు ఉదయం వేళ్లల్లోనే పనులకు వెళ్తున్నారు. మధ్యాహ్నం వరకే పనులు ముగించుకొని ఇండ్లకు చేరుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రజలు రక్షణ చర్యలు తీసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు.
ఎండాకాలం మొదలుకావడంతో రైతులు, వ్యవసాయ కూలీలతోపాటు ప్రజలు వడదెబ్బ తగలకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని పీహెచ్సీ వైద్యులు చెబుతున్నారు. ఎండల తీవ్రత అధికంగా నమోదవుతుండటంతో సాధ్యమైనంత వరకు బయటకు తిరగడం తగ్గించాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని చెబుతున్నారు. వేసవికాలంలో తెల్లటి నూలు, లేతరంగు వస్ర్తాలు ధరించాలని సూచిస్త్తున్నారు.
రైతులు, వ్యవసాయ కూలీలు ఎండలో పని చేయరాదని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఉదయం 11 గంటలు, సాయంత్రం 4గంటల మధ్యలో పనులు చేయరాదని వైద్యులు రామలింగారెడ్డి, కిరణ్కుమార్లు సూచనలు చేశారు. ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్లే కూలీలు రక్షణ చర్యలు తీసుకోవాలని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. వడదెబ్బ తగిలినట్లు తెలిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించి, చికిత్స పొందాలని సూచించారు.