గద్వాల, మే 20 : ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నకు అడుగడున కష్టాలు తప్పడం లేదు. ధాన్యం పండించడం ఒక ఎత్తైతే దానిని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్ముకోవడం తలకు మించిన భారం అవుతున్నది. ప్రభుత్వం రైతులు తమ పంట ఉత్పత్తులను దళారులకు అమ్మి మోసపోకుండా ఉండాలనే ఆలోచనతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెబుతున్నారే తప్పా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అమ్ముకుందామని తీసుకొస్తే కొనుగోలు కేంద్రాల్లో 25రోజులైనా ధాన్యం కొనని పరిస్థితి దాపురించింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సరైనా సౌకర్యాలు లేకపోవడంతో ధాన్యం అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వానికి ముందు చూపు లేని కారణంగా ధాన్యం అమ్ముకునే రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ధాన్యం అమ్ముకుందామంటే టోకెన్లు, తూకం వేయాలంటే టోకెన్లు, గోనెసంచుల కోసం టోకెన్లు, కొనుగోలు చేసిన ధాన్యం గోదాంలకు తరలించాంటే అధికారుల నుంచి టోకెన్లు పొందాలనే నిబంధన విధించడంతో ఇది రైతులకు గుదిబండగా మారింది. టోకెన్ల కోసం గంటల తరబడి వరుసలో నిలబడి టోకెన్లు పొందిన ఎప్పుడు తమ ధాన్యం తూకం వేస్తారో తెలియని పరిస్థితి కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్నది.
జిల్లాలో ప్రధానంగా యాసంగి సీజన్లో వరి, మక్కలు ఎక్కువగా పండిస్తారు. జిల్లాలో మక్కల సాగు 86,122 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు 25క్వింటాల చొప్పున 21,53,071 క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. వీటిని కొనుగోలు చేయడానికి జిల్లాలో 8 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారం 5,66,800 క్వింటాల మక్కలు కొనుగోలు చేశారు. అయితే అధికారులు మాత్రం 70 శాతం కొనుగోలు పూర్తయిందని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
ఇంకా కొనుగోలు కేంద్రాల్లో మక్కలు ఎక్కడికక్కడ ఉన్నాయి. కొనుగోలు చేసేది ఒక ఎత్తైతే దానిని గోదాంలకు తరలించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తుండంతో ఎక్కడ ధాన్యం అక్కడి ఉండి పోయింది. మక్కల రైతులకు గోనె సంచులు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. జిల్లాలో యాసంగిలో 74,162ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. లక్ష మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. రైతులు పండించిన ధా న్యం కొనుగోలు చేయడానికి జిల్లాలో 76 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 5,264మంది రైతుల నుంచి 36,829 క్వింటాల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుతం ధాన్యం కొన్నది గోరంత కొనాల్సింది కొండంతగా ఉంది. కొనుగోలు చేసిన తర్వాత కేంద్రాలకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుండంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఆరుగాలం పండించిన పంట వర్షాలకు తడిస్తే బాధ్యు లు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మహబూబ్నగర్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడ్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన వ రి ధా న్యం అమ్ముకునేందుకు కన్న కష్టాలు పడి మార్కెట్కు తరలిస్తే.. కొనుగోలు చేయకుం డా అధికారులు, ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అన్నదాతల బాధలు వర్ణణాతీతం.
మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల మెట్రిక్ ట న్నులు ఉండగా.. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 60,250 మెట్రిక్ టన్నులు మాత్రమే.. ఇంకా కొనాల్సింది 1,39,750 మెట్రిక్ టన్నులు ఉండా.. జిల్లా వ్యాప్తంగా 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే శారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 396 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. సేకరణ లక్ష్యం 3.50 లక్షల మెట్రిక్ టన్నులుగా అధికారులు టార్గెట్ పెట్టుకొన్నారు. ఇప్పటి వరకు 1,04,861 మె ట్రిక్ టన్నులు మాత్రమే కొనగా.. ఇంకా 2.46 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉన్నది. అలాగే జోగుళాంబ
గద్వాల జిల్లాలో సేకరణ లక్ష్యం లక్ష మెట్రిక్ టన్ను లు నిర్ణయించగా.. ఇప్పటి వరకు కేవలం 36,829 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇంకా కొనాల్సింది.. 63,171 మెట్రిక్ టన్నులు ఉండగా.. మిల్లులకు ఇప్పటి వరకు 26,256 మెట్రిక్ టన్నులు తరలించగా.. జిల్లా వ్యాప్తంగా 76 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాలో టార్గెట్ 1.60 లక్షల మెట్రిక్ టన్నులు నిర్ణయించగా.. ఇప్పటి వరకు కొనుగోలు చేసింది కేవలం 10,500 మెట్రిక్ టన్నులు మాత్రమే.. ఇంకా కొనాల్సింది 1,49,500 మెట్రిక్ టన్నులు ఉండగా.. మిల్లులకు తరలించింది 7 వేల మెట్రిక్ టన్నులు ఉండగా.. 161 సెంటర్లను ఏర్పాటు చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు నిర్ణయించగా.. కొనుగోలు చేసింది కేవలం 9,100 మెట్రిక్ టన్నులు.. ఇంకా కొనాల్సింది 1.89 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా.. కొనుగోలు కేంద్రాలు మొత్తం 200 ఏర్పాటు చేశారు. రైతులు కేంద్రాలకు తెస్తే 25 రోజులైనా కొనుగోలు చేయని పరిస్థితి నెలకొన్నది. దీంతో రైతులకు ఏమి చేయాలో తోచడం లేదు. కొనుగోలు చేసిన తర్వాత కేంద్రాలకు తరలించడంలో నిర్లక్ష్యం వహిస్తుండంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఆరుగాలం పండించిన పంట వర్షాలకు తడిస్తే బాధ్యులు ఎవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కొన్నది గోరంత.. కొనాల్సింది కొండంతగా ఉంది.