నారాయణపేట టౌన్, మార్చి 30: నారాయణపేట జిల్లాలో యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వరి కోతలు మొదలవగా.. ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కృష్ణ, మాగనూర్తోపాటు ఇతర మండలాల్లో పలువురు రైతులు చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రాబోయే పదిహేను రోజుల్లో కోతలు మరింత ఊపందుకునే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర అందించనున్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 ధరతో కొనుగోలు చేయనున్నారు.
ఇప్పటికే కలెక్టర్ శ్రీహర్ష వ్యవసాయ, పౌరసరఫరాల శాఖాధికారులు, మిల్లర్లకు సమీక్ష నిర్వహించి ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా సూచనలు, సలహాలు అందజేశారు. కేంద్రాలను దశల వారీగా ప్రారంభించనున్నారు. సరిహద్దున ఉన్న కర్ణాటక నుంచి ధాన్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రతి ఏడాది అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేసేవారు. అయితే మేలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే చెక్పోస్టులు ఉన్నాయి. దామరగిద్ద మండలం కాన్కుర్తి, కృష్ణ మండలం చేగుంట, కృష్ణ బ్రిడ్జి, నారాయణపేట మండలం జిలాల్పూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులతో ధాన్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనున్నది.
123 కేంద్రాల ఏర్పాటుకు..
యాసంగి సీజన్లో జిల్లాలో మొత్తం 70,209 మంది రైతులు 1,14,445 ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తం 1,91,675 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.. అయితే రైతుల అవసరాలుపోనూ కేంద్రాలకు 1,35,610 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉన్నది. ఇందుకోసం 123 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందిరా క్రాంతిపథం సంఘాల ఆధ్వర్యంలో 60, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో 58, మెప్మా ఆధ్వర్యంలో 4, రైతుల ఉత్పత్పిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఒక కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 2,400 టార్ఫాలిన్లు అవసరం ఉండగా 1,500 అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. తేమ కొలిచే యంత్రాలు 192కుగానూ 175, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు 192కుగానూ 153, ప్యాడీ క్లీనర్లు 96కుగానూ 55 పౌరసరఫరాల శాఖ వద్ద ఉన్నాయి. మిగతావి తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. దీంతో వరి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి. తేమ శాతం 17 లోపు ఉండేలా చూడాలి. అన్ని సౌకర్యాలు క ల్పించాం. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. కొనుగోలు చేసిన డబ్బు ను రైతుల ఖాతాల్లో సకాలంలో జమ చేస్తాం.
– దేవదాస్, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్, నారాయణపేట