జోగులాంబ గద్వాల : ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారు ఒక ఇంట్లో 10 మంది కంటే ఎక్కువ ఉంటే ఏఈ.ఆర్.ఓ లు తప్పని సరిగా ఫీల్డ్ విసిట్ చేసి వివరాలను తెలుసుకోవాలని ఓటరు జాబితా( ఎలక్టోరోల్) పరిశీలకులు (పరిశ్రమల శాఖ కమిషనర్) మాణిక్ రాజ్ కన్నన్ తెలిపారు.
మంగళవారం ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేని ఓటరు జాబితాను రూపొందించాలన్నారు.
ఓటర్లను సంబంధించిన అభ్యంతరాలను స్వీకరించి, ఓటరు జాబితాలో సవరణలు, మార్పులు, చేయాలన్నారు. జిల్లా లో మొత్తం 2,694 దరఖాస్తులు వచ్చాయని, ఏఈఆర్ఓ లు ఒక్క శాతం, బీఎల్ ఓలు 5 శాతం చెక్ చేయాలనీ, పోలింగ్ స్టేషన్ వారీగా బీఎల్ఓ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం రేపటి వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ పంపించాలని తహసిల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీహర్ష, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.