జోగులాంబ గద్వాల : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ధరూర్ మండలం చింతరేవుల, గుడ్డెం దొడ్డి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గతంలో ఏ ప్రభుత్వాలు కూడా రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. గత సంవత్సరం కరోనా సమయంలో రైతులకు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి వారి ఖాతాలో డబ్బులు జమ చేసిందన్నారు.
వ్యవసాయం అంటే దండగా కాదు వ్యవసాయం అంటే పండగ అని నిరూపించిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ నజూమన్నీసా బేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.