గట్టు, మే 17 : గట్టు నలసోమనాద్రి ఎత్తిపోతల పనులకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. మల్లాపురంతండా సమీపంలోని గజ్జలమ్మ గట్టు ప్రాంతంలో నిర్మించనున్న ఈ పథకానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఇదిలాఉండగా గట్టు ఎత్తిపోతల పథకం ఏండ్లుగా నానుతూ వస్తున్నది. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పథకం కొలిక్కి వచ్చింది. గట్టు మండలం మీదుగా నెట్టంపాడు పథకం వెళ్లినా ఉమ్మడి గట్టు మండలానికి ప్రయోజనం లేకుండా పోయిందని, సాగు ఆయకట్టుకన్నా ముంపు ఆయకట్టే అధికంగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. గట్టు ఎత్తిపోతలకు పనులు ప్రారంభం కానుండడంతో ప్రతిపక్షాల నోళ్లకు కళ్లెం పడింది.
వ్యయ, ప్రయోజనాలు ఇవీ..
రూ.553 కోట్ల వ్యయంతో 1.31 టీఎంసీల సా మర్థ్యంతో గట్టు నలసోమనాద్రి ఎత్తిపోతలను నిర్మించనున్నారు. కాగా రూ.328 కోట్ల పనులకు మాత్రమే టెండర్లను పిలవగా, జీవీఆర్ సంస్థ చేజిక్కించుకున్నది. గట్టు, కేటీదొడ్డి, ధరూర్ మండలంలోని కొంతమేర పొలాలకు కూడా సాగునీరు అందనున్నది. ఈ పథకానికి అవసరమయ్యే 935 ఎకరాల భూమిలో ప్రభుత్వ జాగ ఎక్కువగా ఉండడంతో భూసేకరణకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేవు. ర్యాలంపాడు రిజర్వాయర్ నుంచి 3.2 కిలోమీటర్ల వరకు అప్రోచ్ కెనాల్ను తవ్వనున్నారు. ఆ తరువాత పంప్హౌస్ను నిర్మించి ఇన్టేక్ వెల్లోకి నీటిని మళ్లిస్తారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తిపోతలలోకి నీటిని రెండు పైప్లైన్ల ద్వారా తోడిపోస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా పథకాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగులు వేస్తున్నది.