కొల్లాపూర్, మే 17: అమాయక రైతులకు అప్పిచ్చి… అసలు, వడ్డీని రైతులు తిరిగి చెల్లించినా కక్కుర్తిపడి భూమిని తన పేరు మీదకు బదలాయించుకున్నాడు ఓ ఆర్ఎంపీ. లబోదిబోమంటూ బాధితులు తమకు న్యాయం చేయాలని ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆందోళన చేపట్టారు. మనస్తాపంతో ఓ రైతు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో చోటు చేసుకున్నది. బాధిత రైతుల కథనం మేరకు.. పెంట్లవెల్లికి చెందిన బింగి నడిపి నాగన్నకు గ్రామ శివారులో సర్వేనంబర్లు 657, 658లో 4 ఎకరాలు పట్టా భూమి ఉన్నది. వ్యక్తిగత అవసరం నిమిత్తం ఆర్ఎంపీ వైద్యుడు మల్లయ్య వద్ద 2007లో రూ.60 వేలు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు, వడ్డీతో సహా చెల్లించినా.. తన తండ్రికి మాయమాటలు చెప్పి దొంగచాటుగా సంతకం తీసుకొని నాలుగు ఎకరాలు పట్టా మార్పిడి చేసుకున్నాడని అతడి కుమారుడు బింగి కృష్ణయ్య తెలిపాడు.
ఈ విషయమై ప్రశ్నిస్తే తమను చంపుతామని ఆర్ఎంపీ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. అలాగే ఆర్ఎంపీని నమ్ముకొని జటప్రోలుకు చెందిన రైతు ఓరే బీరయ్య, గోప్లాపూర్కు చెందిన రైతు రంగారెడ్డి కూడా మోసపోయారు. వీరందరూ ఆర్ఎంపీ మల్లయ్యను నిలదీయండంతో కోర్టులో అక్రమ కేసులు వేసి మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా మంగళవారం కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయానికి ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని ఆర్డీవో హనుమానాయక్కు వినతిపత్రం అందజేశారు. అయితే మనస్తాపానికి గురైన రైతు బింగి కృష్ణయ్య తన వెంట తెచ్చుకున్న క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే అక్కడున్న సిబ్బందిని ఆర్డీవో అప్రమత్తం చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయంలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు.