మల్దకల్, జూన్ 29: ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర ఆలయం అమావాస్యను పురస్కరించుకొని బుధవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం అర్చకులు రవిచారి, రమేశ్ చారి, మధుసూదన్చారి ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయంలో మల్దకల్, పెద్దొడ్డికి చెందిన భజన మండలి సభ్యులు భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో కథకుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాన్ని హరికథా రూపంలో వివరించారు. హరికథకు తబల బండలయ్య, హార్మోనీయం సుధాకర్ వ్యవరించారు. భక్తులకు కాకతీయ టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో మధ్యాహ్నం, శాంతినగర్కు చెందిన శివశివానీ టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో రాత్రి భక్తులకు అన్నదానం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఏర్పాట్లు చేశారు.
ఆలయంలో సంప్రోక్షణ, రథాంగ హోమం
ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం గ్రామానికి చెందిన భక్తుడు దామశంకరయ్య దంపతులు అర్చకులు మధుసూదన్చారి, రమేశ్చారి ఆధ్వర్యంలో సంప్రోక్షణ, రథాంగ హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గతంలో దాతలు శంకరయ్య రూ.6 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన రథాన్ని ఆలయానికి వితరణ చేశారని పేర్కొన్నారు. రథానికి అదనంగా రూ.లక్ష వెచ్చించి మరమ్మతులు చేయించారని తెలిపారు. ఇందుకు రథాంగ, సంప్రోక్షణ హోమాలు నిర్వహించి ఆలయానికి అందజేశారన్నారు. కార్యక్రమంలో ధీరేంద్రదాస్, మురళి దంపతులు, దాతల కుటుంబ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తిక్కవీరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
అయిజ, జూన్ 29: పట్టణంలోని తిక్కవీరేశ్వర స్వామికి బుధవారం అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకం, అలంకరణ, పుష్పాభిషేకం, అర్చనలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం చేశారు. అలాగే పట్టణంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్ప స్వామి, వీరబ్రహ్మేంద్ర శివరాంజనేయస్వామి, ఉత్తనూర్ ధన్వంతరి వేంకటేశ్వరస్వామి, తుపత్రాలలోని ఆంజనేయస్వామి, ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
పంచముఖ ఆంజనేయస్వామికి పూజలు
రాయచూరు జిల్లా, మాన్వి తాలూకాలో వెలిసిన పంచముఖ ఆంజనేయస్వామికి భక్తులు పోటెత్తారు. బుధవారం అమావాస్య కావడంతో తెలంగాణ, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవస్థాన అర్చకులు స్వామికి అభిషేకం, ఆకుపూజ, పుష్పాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయస్వామికి దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.