Collector Santosh | గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. సీడీవోసీ సమావేశ మందిరంలో గురువారం వెబ్ కాస్టింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించారు. గద్వాల, ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల్లో పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది విధులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం పోలింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
మొదటి విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మొత్తం 106 గ్రామ పంచాయతీలలో 14 జీపీలు ఏకగ్రీవం అయ్యాయని, మిగిలిన 92 గ్రామ పంచాయతీలలో సర్పంచ్ తో పాటు 839 వార్డు సభ్యుల ఎన్నికకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా పోలింగ్ స్టేషన్లలో మొత్తం 839 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1077 మంది ఓపీవోలు విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 92 గ్రామపంచాయతీల్లో మొత్తం 1,31,679 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు చెప్పారు. ఇందులో 66,994 మంది మహిళలు, 64,684 మంది పురుషులు, ఒకరు ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్టేజ్ 2 అధికారి పోలింగ్ సజావుగా జరిగేలా చూస్తారన్నారు. జోనల్, స్థానిక మండల స్థాయి అధికారులు, పోలీస్ యంత్రాంగం, ఇతర సిబ్బంది పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు విధులు నిర్వర్తిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ నర్సింగరావు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగేంద్రం, డీపీవో శ్రీకాంత్, ఇతర అధికారులు ఉన్నారు.