మహబూబ్నగర్/టౌన్, అక్టోబర్ 12: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లో ఇండ్లల్లోకి వర్షపునీరు చేరింది. జిల్లా కేంద్రంలోని రామయ్యబౌళి, బాలాజీనగర్, బీకే.రెడ్డికాలనీ, శివశక్తినగర్తోపాటు పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మధురానగర్లో మహబూబ్నగర్-భూత్పూర్ ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు తెగిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. బీకేరెడ్డికాలనీ, రామయ్యబౌలిపాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిపిన ద్విచక్రవాహనాలు వర్షపునీటిలో కొట్టుకుపోయాయి.
కలెక్టరేట్లో ఉన్న ఎస్బీఐలోకి వర్షపునీరు చేరింది. దీంతో ప్రత్యేక మోటార్ సహాయంతో నీటిని తొలగింపు పనులను చేపట్టారు. ప్రస్తుత కలెక్టరేట్ సమీపంలో రెండుకార్లు వర్షపునీటిలో చిక్కుకుపోవడంతో అధికారులు, ప్రజలు సురక్షితంగా బయటకు తీశారు. తెలంగాణచౌరస్తా సమీపంలో బిస్కెట్ డిస్టిబ్యూటర్ దగ్గర ఉన్న వివిధ తినుబండారాలు పూర్తిగా తడిచిపోయాయి. దీంతో రూ.35లక్షల వరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు తెలిపారు. పట్టణంలో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ ఎస్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తోపాటు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కమిషనర్ ప్రదీప్కుమార్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.