Gadwala municipality | మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల కాంగ్రెస్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జోగులాంబ గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకాల వ్యవహారం కొలిక్కి రావడంతో.. 37 వార్డులకుగాను 7 సీట్లను సరిత తిరుపతయ్య వర్గం, ఎమ్మెల్యే బండ్ల వర్గానికి ౩౦ సీట్లు కేటాయించారు. అయితే ముందుగానే నేడు ఉదయం ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 37 వార్డులకుగాను 37 వార్డుల అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బీ ఫాంలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులంతా అధికారులకు భీ ఫామ్లను సమర్పించారు.
అయితే ఇదిలా ఉంటే మరోవైపు సరితా తిరుపతయ్య వర్గం సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. తమకు అధిష్టానం 7 వార్డులను కేటాయించిందంటూ సరిత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు బీ ఫామ్లతో దర్శనమిచ్చారు. కాగా ఆ 7 వార్డులకు ఇప్పటికే ఎమ్మెల్యే బండ్ల వర్గానికి చెందిన అభ్యర్థులు బీ ఫామ్లు సమర్పించారు. ఇలా ఒకేసారి 7 వార్డులకు రెండు వర్గాలకు కాంగ్రెస్ బీ ఫామ్లు ఇవ్వడం పట్ల గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల్లో ఇంతకీ ఎవరి బీ ఫామ్లు చెల్లుతాయనేది తెలియాల్సి ఉంది.

