జోగులాంబ గద్వాల : వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక, చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వివిధ కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బ్యాంకర్లతో డిసిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు అందించే వ్యవసాయ రుణాలను సకాలంలో మంజూరు చేసి నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, కార్పొరేషన్ల కింద నిర్దేశించిన రుణాలను వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన కింద మంజూరు చేసిన రుణాలను ఇవ్వాలన్నారు.
ఎస్సీ, ఎస్టీలకు పాడి బర్లు , కూరగాయల వ్యాపారం తదితర పథకాలపై బ్యాంకర్ల దృష్టిసారించి రుణాలు మంజూరు చేయాలన్నారు . పరిశ్రమలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా, క్లియర్ చేయాలని, ఎక్కువ మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.
మహిళా అభివృద్ధికి ఎస్.హెచ్.జి గ్రూపులకు నిర్దేశించిన పద్ధతిలో రుణాలు మంజూరు చేయాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా చేనేతకు ప్రసిద్ధి చెందినదని, జిల్లాలోని చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో వెనుకబడి ఉన్నందున, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టి చేనేత కార్మికులకు ప్రభుత్వo అందించే రుణాల పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 2022 – 23 వార్షిక రుణ ప్రణాళికకు సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు.