జోగులాంబ గద్వాల : ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రత్యేక అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నేరవేరుస్తోందని పేర్కొన్నారు.
వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ వేగ వంతంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు పూర్తి బాధ్యతతో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో సర్వే పక్కా సమాచారం సేకరించాలని, అర్హులైన లబ్ధిదారులు లిస్ట్ సిద్ధం చేయాలని అన్నారు. వెరిఫికేషన్ ఫామ్ ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పక్కా సమాచారం రాయాలని, ఇందిరమ్మ కమిటీలు కేటాయించిన జాబితా కచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్ రావు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.