Gadwal | జోగులాంబ గద్వాల : జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో పెండింగ్ ఆయకట్టు భూ సేకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద పెండింగ్లో ఉన్న 480 ఎకరాల భూసేకరణపై చర్యలు తక్షణమే ప్రారంభించాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వారీగా తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), మండల సర్వేయర్, ఇరిగేషన్ అధికారులతో కూడిన ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసి భూ సేకరణను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. భూమికి పరిహారం చెల్లించిన వెంటనే సివిల్ వర్క్స్ ప్రారంభించాలని స్పష్టం చేశారు. కాలువల నిర్మాణం వల్ల గ్రామాల అభివృద్ధి, సాగు సౌకర్యాలు ఎలా మెరుగవుతాయో ప్రజలకు వివరించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తానని కలెక్టర్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఎస్.ఈ రహీముద్దీన్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.