మహబూబ్నగర్, జూలై 16 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని, వందలాది మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని కావున పోలీసులు, ఆర్టీసీ అధికారులు వారి పొట్టకొట్టకుండా మానవతా దృక్పథంలో వ్యవహరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. మహబూబ్నగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆటోలు ఆపొద్దని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో గురువారం ఆటో డ్రైవర్లు బస్టాండ్ ఎదుట ఆందోళన నిర్వహించగా పోలీసులు వారిని టుటౌన్ పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంటనే టుటౌన్ పోలీస్స్టేషన్కు చేరుకొని ఆటో డ్రైవర్ల సమస్యను తెలుసుకొని వారితో కలిసి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరించారు.
ఈ సందర్భంగా అధికారులు ఆటో డ్రైవర్ల బస్టాండ్ ముందు కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్లు ప్రయాణికుల కోసం ఆటోలు అపుతున్నారని, బస్సులు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నదని తెలిపారు. స్పందించిన మాజీ మంత్రి అధికారులు వాటిని అక్కడ ఆపడానికి అనుమతి ఇవ్వకుంటే ఆటో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతాయని, పిల్లల చదువులు కుటుంబ పోషణ, రుణాలు చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని గుర్తు చేశారు. అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించాలని అధికారులకు సూచించారు. అధికారులు సూచించిన విధంగా బస్టాండ్ ము ందు ఆటోలు కార్మికులు నిలుపుకొంటారని అనుమతి ఇవ్వాలని కోరారు.
క్రమపద్ధతిలో ఆటోలు నిలిపి ప్రయాణికులను తీసుకువెళ్లాలని, బస్సులకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని అధికారులు ఆటో డ్రైవర్లకు సూచించారు. దానికి ఆటో డ్రైవర్లు ఒప్పుకోవడంతో ఆటోలు నిలుపుకొనేందుకు అవకాశం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యపై స్పందించి పరిష్కారానికి చొరవ తీసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఆటో డ్రైవర్లు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి వెంట గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.