వనపర్తి టౌన్, జనవరి 14 : వనపర్తి జిల్లా కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల కుమారుడు దినేశ్ ఆదివారం అమెరికాలో మృతి చెందాడు. బీటెక్ పూర్తి చేసుకున్న దినేశ్ ఎంఎస్ చదివేందుకు గతేడాది డిసెంబర్ 28న అమెరికా వెళ్లాడు. కాగా, శనివారం రాత్రి భోజనం చేసి రూంలో పడుకున్న విద్యార్థి నిద్రలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడై తిరిగి వస్తాడని ఆశించిన కుటుంబ సభ్యులు మరణవార్త తెలుసుకొని లబోదిబోమంటున్నారు. దినేశ్తోపాటు బీటెక్ పూర్తి చేసిన మరో తెలుగు విద్యార్థి కూడా రూంలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దినేశ్ మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే, దినేశ్ మృతి వార్తను తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఎదిగి వచ్చిన కొడుకును కోల్పోవడం చాలా దురదృష్టకరమని ధైర్యంగా ఉండాలని, ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని భరోసా కల్పించారు. పార్థివదేహాన్ని ఇండియాకు రప్పించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో మాట్లాడుతానన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. పరామర్శించిన వారిలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కౌన్సిలర్లు ప్రేమ్నాథ్రెడ్డి, రవి, కృష్ణ, చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు అశోక్, జాత్రునాయక్, రాము, ముత్తుకృష్ణ, చెన్నరాములు ఉన్నారు.