అయిజ, జూలై 21 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద ప్రవాహం తగ్గుతోంది. గురువారం 22గేట్లు రెండు అడుగులు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు 73,902 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 73,902 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 100.836 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు 1,03,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 1,03,235 క్యూసెక్కులు దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోంది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 565 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 13 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు పేర్కొన్నారు.
సుంకేసుల నుంచి నీటి విడుదల..
రాజోళి, జూలై 21 : మండలంలోని సుంకేసుల డ్యాం నుంచి వారం రోజులుగా నీటి విడుదల కొనసాగుతున్నది. గురువారం డ్యాం జేఈ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. టీబీడ్యాం నుంచి సుంకేసుల డ్యాంకు 1,09,861క్యూసెక్కుల వరద వస్తున్నట్లు తెలిపారు. 27గేట్లు మీటర్ మేర ఎత్తి శ్రీశైలం డ్యాంకు 1,08,321క్యూసెక్కులు తరలిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన కేసీ కెనాల్కు ద్వారా 1,540క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు.
జూరాలలో..
అమరచింత, జూలై 21 : జూరాల రిజర్వాయర్కు వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రానికి 81 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఐదు గేట్లెత్తి 20,195 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ఎగువ, దిగువ జూరాలలోని 12 యూనిట్లలో 42,406 క్యూసెక్కులను వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 8.396 నీటి నిల్వ ఉన్నది. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500, భీమా-1కు 1,300, ఎడమ కాలువకు 920, కుడి కాలువకు 411, సమాంతర కాలువకు 500 క్యూసెక్కులు విడుదలవుతుండగా.. ప్రాజెక్టు నుంచి మొత్తంగా 67,322 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది.
శ్రీశైలం ప్రాజెక్టుకు..
శ్రీశైలం, జూలై 21 : శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 20,195, విద్యుదుత్పత్తి నుంచి 42,406, సుంకేసుల నుంచి 1,02,654 (మొత్తం 1,65,255 క్యూసెక్కులు) విడుదల కాగా.., లక్ష డబ్బువేల క్యూసెక్కులకు పైగా జలాశయానికి నీరు వచ్చి చేరుతున్నది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.., ప్రస్తుతం 880.20 అడుగులు ఉన్నది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 189.454 టీఎంసీలు నిల్వ ఉన్నది. టీఎస్ పవర్హౌస్లో విద్యుదుత్పత్తి నుంచి 19,070 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు.