గద్వాల, జూలై 14 : సీడ్పత్తి సాగుకు జోగుళాంబ గద్వాల జిల్లా పెట్టింది పేరు. దేశంలో గుజరాత్ తర్వాత అదేస్థాయిలో విత్తనపత్తి పండించే జిల్లా జోగుళాంబ గద్వాల జిల్లా. జిల్లాలో సీడ్పత్తి సాగు చేసిన రైతులు సుంకురాక సరైన సమయంలో క్రాసింగ్ చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు సీడ్ విత్తనాలు ఇచ్చిన ఆర్గనైజర్లు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. కొంత మంది సీడ్ ఆర్గనైజర్లు సమాజంలో పేరున్న వ్యక్తులుగా చెలామణి అవుతూ కల్తీ విత్తనాలు రైతులకు అంటగట్టి పబ్బం గడుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. రెండు నెలల కిందట మల్దకల్, ధరూర్ మండలాల్లో దొరికిన విత్తనాలే ఉదహరణగా చెప్పవచ్చు. పంట పెరిగి సుంకు వచ్చిన తర్వాత క్రాసింగ్ చేసే సమయంలో సుంకు రాక రైతులు అవస్థలు పడుతున్నారు. ఆడ, మగ పత్తికి క్రాసింగ్ చేస్తేనే కాయకాయడానికి అవకాశం ఉంటుంది. అయితే క్రాసింగ్ చేసే సమయంలో సుంకు రాకపోవడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. పంటపై పెట్టిన పెట్టుబడి అంత బూడిదపాలు అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యవర్తులుగా ఆర్గనైజర్లు..
సీడ్ పత్తి సాగు చేసే రైతులకు కంపెనీలకు ఎటువంటి సంబంధం ఉండదు. వీరికి మధ్యవర్తులుగా ఆర్గనైజర్లు వ్యవహరిస్తున్నారు. రైతు సాగు చేసిన పత్తి పంటకు నష్టం వాటిల్లితే రైతునేరుగా కంపెనీని అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు ఆర్గనైజర్లతో ఒప్పందం చేసుకోవడమే ఇందుకు కారణం. దీంతో పంట వచ్చినా, రాకున్నా పెట్టుబడి రూపంలో ఇచ్చిన అప్పును మాత్రం ఆర్గనైజర్లు రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. కొంతమంది ఆర్గనైజర్లు అప్పు ఇచ్చే సమయంలో రైతులతో ప్రామిసరీ నోట్లు రాయించుకోవడంతోపాటు వారి ఆస్తులు తనాఖా పెట్టుకుంటున్నారు. రైతు అప్పు కట్టలేని పరిస్థితిలో ఆర్గనైజర్లు వారి పొలాలు స్వా ధీనం చేసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. దీంతో పత్తిసాగు చేసిన రైతులు అప్పులపాలు అవుతుండగా, వారికి అప్పు ఇచ్చిన ఆర్గనైజర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. ఒకప్పుడు సైకిల్లేని వ్యక్తులు ఇప్పుడు లక్షల విలువ చేసే లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు.
లెక్కలు లేని వ్యవసాయశాఖ..
రైతులు సాగు చేసిన పంటల వివరాలు వ్యవసాయశాఖ అధికారులతో ఉండాలి. కానీ సీడ్పత్తి సాగు చేసిన రైతుల వివరాలు వారి దగ్గర ఉండడం లేదు. అధికారులకు కంపెనీలు, ఆర్గనైజర్లు పంటల వివరాలు ఇవ్వరు. ఎందుకంటే ఏదైనా కారణంతో రైతు నష్టపోతే పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ఇటు కంపెనీలు, అటు ఆర్గనైజర్లు వ్యవసాయశాఖకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది సీడ్ పత్తి సాగు సుమారు 40వేల ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం జిల్లాలో సీడ్ పత్తి సాగు కేవలం 12,923 ఎకరాలు చేసినట్లు గుర్తించారు. మిగతా పంట సాగు చేసిన వివరాలు కంపెనీలు, ఆర్గనైజర్లు వ్యవసాయశాఖకు ఇవ్వనట్లు తెలుస్తున్నది.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు..
ఈనెల 7వ తేదీన కలెక్టర్ వల్లూరు క్రాంతి కంపెనీలు, ఆర్గనైజర్లు, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో ఎన్ని ఎకరాల్లో సీడ్పత్తి సాగు చేశారు, ఎంత ఉత్పత్తి వస్తుందనే విషయాలు కంపెనీలు, ఆర్గనైజర్లు వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేయాలని చెప్పినప్పటికీ ఇంత వరకు వారు వ్యవసాయశాఖకు సమాచారం ఇవ్వలేదు.
నేరుగా అగ్రిమెంట్ చేసుకుంటే లాభం..
సీడ్ పత్తి సాగు చేసే రైతులు మధ్యవర్తులైన ఆర్గనైజర్ల వద్ద అగ్రిమెంట్ చేసుకోకుండా నేరుగా కంపెనీలతో ఒ ప్పందం చేసుకుంటే మేలు జరిగే అవకాశముంది. రైతుసా గు చేసిన పత్తికి సుంకు రాకపోయినా ఇతర ఏ కారణం చేతనైనా రైతులు నష్టపోతే కంపెనీల నుంచి పరిహారం ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. రైతులకు నకిలీ విత్తనాలు అందించే కంపెనీలు, ఆర్గనైజర్లపై చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు.