‘మా కంపెనీ విత్తనాలు విత్తితే పూత, కాయ బాగా వస్తుంది’.. ‘లేదు మా విత్తనాలు ఇంకా బాగుంటాయి.. పంట ఏపుగా పెరగడంతోపాటు మంచి దిగుబడి వస్తుంది’.. ఇలా ఎవరికి వారుగా కంపెనీలు గొప్పలు చెప్పుకోవడం పరిపాటి.. రైతులను తేలికగా బుట్టలో వేసుకుంటున్నారు. నాసిరకం విత్తనాలు అంటగట్టిన కంపెనీలు, డీలర్లు కోట్లకు పడగలెత్తుతుంటే రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. వానకాలం సీజన్లో గద్వాల జిల్లాలో ఓ కంపెనీ పత్తి విత్తనాలను విత్తగా సగానికి పైగా దిగుబడి తగ్గడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరికొన్ని చోట్ల పూత రాకపోవడం.. పూత వచ్చినా కాయ నిలబడకపోవడంతో అప్పులపాలయ్యారు. ఏటా నకిలీ బెడద తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నాసిరకం విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గద్వాల, నవంబర్ 2 : పత్తి రైతుల నష్టం వెనుక పాపం ఎవరిది..? నాసిరకం విత్తనాలు వేయడంతో మొక్క పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా కాయ నిలబడకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని ఒక వైపు రైతులు ఆందోళన చేస్తునారు. మరోవైపు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే పంట రావడం లేదని చెబుతున్నారు. ఇందులో ఏది నిజం రైతులు చెప్పేదా..? లేక శాస్త్రవేత్తలు చెప్పేదా..? అని తెలియడం లేదు. ఏటా రైతులు నాసిరకం విత్తనాలతో నష్టపోతూనే ఉన్నారు. కానీ, డీలర్లు, కంపెనీలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. నాసిరకం విత్తనాలతోనే నష్టపోయామని రైతులు చెబుతుంటే.. అధికారులు, శాస్త్రవేత్తలు మాత్రం ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పి వెళ్లిపోతున్నారే తప్పా న్యాయం చేయడం లేదంటూ కర్షకులు వాపోతున్నారు. రైతులకు మంచి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ క్లస్టర్కు ఒక రైతువేదికను నిర్మించి వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సీజన్ ప్రారంభంలో అధికారులు విత్తన, ఎరువుల దుకాణాలు తనిఖీ చేయడంతోపాటు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపాలి. అలాగే మూడు నెలలకోసారి విత్తన, ఎరువుల దుకాణాలు తనిఖీ చేయాలి. కానీ జిల్లాలో తనిఖీలు జరగడం లేదు. రైతులకు నాసిరకం విత్తనాలు అందించే కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కంపెనీ నిర్వాహకులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా కొత్తకొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. నష్టం చేసిన కంపెనీలపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే, అధికారులు, శాస్త్రవేత్తలు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి తూతూ మంత్రంగా చూసి.. వాతావరణ మార్పులతో పంట రావడం లేదని చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందంటున్నారు. కంపెనీలపై చర్యలు తీసుకొని.. ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో కమర్షియల్ పత్తిని 1,90,556 ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారుల అంచనా. ఎకరాకు సరాసరి 10 క్వింటాళ్ల చొప్పున 19,05,560 క్వింటాళ్ల దిగుబడి రావాలి. నాసిరకం విత్తనాలు వాడడంతో ప్రస్తుత పరిస్థితుల్లో దిగుబడి సగానికి పడిపోయింది. ప్రస్తుతం 9,52,780 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. మద్దతు ధర రూ.6 వేలు వేసుకున్నా.. సుమారు రూ.571,66,80,000 నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. తాము నష్టపోవడానికి కారణమైన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు ఇటీవల కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫిర్యాదు చేశారు.
కంపెనీలపై చర్యలు తీసుకోవాలి..
20 ఎకరాలు కౌలుకు తీసుకొని సూర్సీడ్, వీఎస్ కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు నాటాను. ఇప్పటివరకు సుమారు రూ.8 లక్షల పెట్టుబడి పెట్టాను. మొక్క పెరిగినా పూత కాయ రావడం లేదు. అక్కడక్కడ కాయ కాసినా రాలిపోతున్నది. విత్తనాలు నాసిరకంగా ఉండడం వల్లే ఇలా జరిగింది. శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చారు. కంపెనీలపై చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలి.
– గోవిందు, రైతు, తక్కశిల
పరిహారం చెల్లించాలి..
ఆరెకరాల్లో సూపర్, 666, క్రిస్టల్ తదితర పత్తి విత్తనాలు నాటాను. మొక్క పెరిగినా పూత కాయ లేదు. ఇప్పటి వరకు రూ.మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టా ను. పైసలంతా నేలపాలైంది. పంటను చూస్తే బాధేస్తున్నది. శాస్త్రవేత్తలు వాతావరణ మార్పుల వల్ల పంట రావడం లేదని కంపెనీలకు వత్తాసు పలుకుతున్నారు. నాసిరకం విత్తనాల వల్లే తాము నష్టపోయాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని క్లస్టర్కు ఒక ఏఈవోను నియమిస్తే.. వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. కంపెనీల నుంచి నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– బాలీశ్వరయ్య, రైతు, బైరాపురం
ప్రభుత్వానికి నివేదిస్తాం..
జిల్లాలో రైతులు సాగు చేసిన పత్తి పంటను వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశీలించారు. వారు ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. జిల్లాలో పత్తి రైతులు ఆందోళన చేస్తున్నారు. వారికి ఉన్న సమస్యలను నేగా తమ దృష్టికి తీసుకురావాలి.
– గోవింద్నాయక్, వ్యవసాయశాఖ జిల్లా అధికారి, జోగుళాంబ గద్వాల