నవాబ్పేట, డిసెంబర్10 : నవాబ్పేట మార్కెట్యార్డుకు ఆదివారం రైతులు భారీగా ధాన్యాన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో వరికోతలు ఊపందుకోవడం, వరి ధాన్యానికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో వరి సన్నరకాలతోపాటు, దొడ్డు రకం ధాన్యానికి సైతం ధర అధికంగా పలకడంతో కొనుగోలు కేంద్రాలకంటే మార్కెట్లోనే అధిక ధర లభిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. గత బుధవారం వాతావరణ పరిస్థితుల కారణంగా ధాన్యానికి టెండర్లు వేయకపోవడంతో ధాన్యం నిల్వలు మార్కెట్లో అధికమయ్యాయి. రెండు రోజుల కిందట టెండర్లు వేసిన ధాన్యం లిఫ్ట్ చేయకపోవడంతో ధాన్యం బాగా పేరుకుపోయింది.
ఆదివారం ఒక్క రోజే వివిధ గ్రామాల 22వేల వరి ధాన్యం బస్తాలు రావడంతో ధాన్యం మార్కెట్లో అన్లోడ్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. చివరికి సాయంత్రం ధాన్యాన్ని అన్లోడ్ అధికారులు చొరవ తీసుకొని ధాన్యాన్ని అన్లోడ్ చేయించారు. ధాన్యం అధికంగా రావడంతోనే టెండర్లు వేయలేదని మార్కెట్ కార్యదర్శి రమేశ్కుమార్ తెలిపారు. గత వారంలో నిర్వహించి టెండర్లలో ఆర్ఎన్ఆర్ సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.3,319 అధిక ధర లభించినట్లు తెలిపారు. అలాగే దొడ్డు రకం(1010) ధాన్యానికి క్వింటాకు రూ.3,058 ధర లభించినట్లు ఆయన తెలిపారు. సోమవారం టెండర్లు వేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.