ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రాత్రి కరెంట్ కు కర్షకులెందరో బలయ్యారు. నాటి పాలకులు ఇచ్చే రెండు, మూడు గంటల కరెంట్ కోసం రైతులకు నిరీక్షణ తప్పేది కాదు. రాత్రి వచ్చే పవర్ కోసం పొలాల వద్ద జా గరణ చేస్తూ నిశీధి రాత్రిలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇం టి పెద్ద దిక్కు ప్రాణాలు గాలిలో కలిసిపోతే పట్టించుకునే దిక్కు లేక వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నేటికీ ఆయా కుటుంబాలు ఆర్థికంగా ఇంకా తేరుకోలేదు. హస్తం హయాంలో రైతు మృత్యుఘోష ఇలా సాగింది. అందుకే వారి పాలన అంటే టక్కున గుర్తొచ్చేది కరెంట్ కష్టాలు.. నాడు బోర్లు వేద్దామంటే విద్యుత్ సరఫరా ఉండేది కా దు.. పొలాలకు నీరందక పలు సందర్భాల్లో పంటలు ఎండిపోయిన సంఘటనలు కోకొల్లలు.. నీరు పారిద్దామంటే కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియని దుస్థితి. ఎ ప్పుడోగాని కరెంట్ వస్తే అందరూ ఒకేసారి మోటర్లు వేయడంతో లోడ్తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే పరిస్థితి. కానీ తెలంగాణ వచ్చాక వారి కష్టాలు తీరాయి. మళ్లీ కాంగ్రెస్ను నమ్మితే కరెంట్ కష్టాలు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు.
వనపర్తి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో అత్యధికంగా కరెంట్ మోటర్లతో సేద్యం చేసే జిల్లాగా వనపర్తి పేరు తెచ్చుకున్నది. ఆంధ్రా ముఖ్యమంత్రులు పాలించినంత కాలం ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి ఇక్కడి భూముల్లో పల్లేర్లు మొలపించిన చరిత్ర వారిది. ఎలాంటి ప్రాజెక్టుల నీటి వసతిని కల్పించకుండా కేవలం బోరు.. బావుల ఆధారంగానే సేద్యాన్ని నడిపించిన నాటి పాలకులు అదే కరెంట్ షాక్లకు వందలాది మంది అన్నదాతల ఉసురుపోయేలా చేశారు. గంటల వ్యవధిలో సరఫరా చేసే కరెంట్తో రాత్రి.. పగలు ఎదురు చూపులతో అన్నదాతలు నిద్రలేని రాత్రులను గడిపారు. ఈ పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటుకు ఓ ఐదేండ్ల ముందు కాంగ్రెస్ పాలనలో జిల్లాలో కరెంట్ షాక్లకు గురై చనిపోయిన అన్నదాతల కుటుంబాలు అనేకం. నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 99 మంది రైతులు అసువులు బాసారు. 2008లో 16 మంది, 2009లో 14 మంది, 2010లో 15 మంది, 2011లో 27 మంది, 2012లో 15 మంది, 2013లో 12 మంది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కరెంట్ సక్రమంగా రాకపోతుండడంతో వచ్చిన సమయంలోనే బోర్లు వేసేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. రెండు విడుతలు కరెంటు ఇస్తున్నామని చెప్పినా అది ఎప్పుడు వచ్చుడో.. ఎప్పుడు పోవుడో అన్న చందాన వ్యవసాయం ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. ప్రస్తుతం జిల్లాలో మొత్తం వ్యవసాయానికి సంబంధించి 2,54,188 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.
సమైక్య పాలనలో పట్టపగలే కరంట్ షాక్లకు గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. మాది గోపాల్పేట మండలం లక్ష్మీ తండా. మాకు మూడెకరాల పొలం ఉంది. బోరు కింద పంటలేసేటోళ్లం.. ఉండగా.. నా భర్త భద్రునాయక్ పొలం దగ్గరకు వెళ్లి పగలే కరెంట్ షాక్కు గురై 2013లో చనిపోయాడు. ఆ సమయంలో నేను కూడా వెంట ఉండడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నా.. మాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తర్వాత పంటలు పండుడు కష్టమని భావించి కాడెద్దులతోపాటు ఉన్న పశువులను అమ్ముకొని బతుకు వెల్లదీశాను. కానీ తెలంగాణ వచ్చినంక కరెంటు బాగుంది.. ఎప్పుడంటే అప్పుడే బోర్లు వేసుకోవచ్చు. తెలంగాణ రాకముందు నా భర్త సచ్చిపోయిండు. కేసీఆర్ వచ్చినంక నాకు పింఛన్ వస్తుంది. రెండు వేలతో బతుకు నడుస్తుంది. ఇయ్యాలా కరెంట్తో పని లేకుండా కాలువల్ల నీళ్లొచ్చినయి.. ఇట్లా ఉంటే, నా భర్త కూడా చనిపోయేవాడు కాదు. కాడి కిందేసినం.. పిల్లలు తలోదారిలో బతుకుతున్నరు. కరెంట్ షాక్తో భర్త సచ్చిపోవడంతో మా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ రాకుంటే.. కేసీఆర్ లేకుంటే.. ఇంకా కష్టమే ఉంటుండే..
మాది ఉమ్మడి కుటుంబం.. నా తండ్రి చిన్న బాలయ్య సేద్యం పనులను చేసేటోడు. నలుగురు అన్నదమ్ములుంటే, నా తండ్రే ఎక్కువగా పంటలు పండించేటోడు.. మొత్తం 14 ఎకరాలు ఉండేది. గ్రామ సమీపంలోని చెరువు కిందే పొలం ఉండేది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరువు, కాటకాలు ఉండేవి. కాల్వలకు నీళుల అసలే ఉండేవికావు. కేవలం బోర్లపై ఆధారపడి సేద్యం చేసేటోళ్లు.. కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడే బోరు మోటర్ ఆన్చేయాలి. లేకుండా నీళ్లు అందక పంటలు ఎండిపోయేవి. దీంతో కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడే పొలం వద్దకు వెళ్లి బోర్లు వేసేటోళ్లు.. అయితే నా తండ్రి కూడా బోరు వేసేందుకు పొలం వద్దకు వెళ్లి నీళ్లు పెట్టే సమయంలో విద్యుత్ వైర్ కనిపించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మరుసటి రోజు పసుల కాపర్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం.. గ్రామ పెద్దలు కొంత ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. నా తండ్రికి ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు. తెలంగాణ వచ్చాక మా చెరువుకు నీటి కరువు లేదు. మంత్రి నిరంజన్రెడ్డి బుద్ధారం బ్రాంచి కెనాల్ ద్వారా సాగునీరు పారిచ్చిండు. మాకు ఇప్పుడు బోర్లతో పనే లేదు. చెరువు నీళ్లే మా పొలాలకు సమృద్ధిగా పారుతున్నాయి. ఆంధ్రా పాలనలో కరెంట్ కష్టాలతో మానాన్న చనిపోవడం మాకు తీరని బాధను మిగిల్చింది.
గత కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. మాది వ్యవసాయ కుటుంబం నాకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. మాకు మూడు ఎకరాలు పొలం ఉండేది. 2004 సంవత్సరంలో నా చిన్న కొడుకు మహేశ్ పంట పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన సమయంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంట్ కష్టాలు ఎదుర్కొనేవారు. కరెంట్ ఉన్నా లో వోల్టేజీ సమస్యతో విద్యుత్ మోటర్లు నడిచేవి కావు. ఏడాదిలో నాలుగైదు సార్లు మోటర్లు కాలిపోయేవి. కరెంటు కోసం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలు.. లోవోల్టేజీ సమస్యతో ఏడాదిలో నాలుగు సార్లకుపైగానే విద్యుత్ మోటర్ల కాలిపోయేవి. అడిగితే కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను కొట్టించిన సంఘటనలు ఉన్నాయి. రాత్రివేళ పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లి ఎందరో షాక్కు గురై మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. కరెంట్ కోసం నిత్యం రోడ్లపై ధర్నాలు చేసేటోళ్లు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. దీంతో రైతులు వారి పొలాల వద్దకు ఎప్పుడైనా వెళ్లి నీరు పారించుకునే అవకాశం ఏర్పడింది. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం కరెంట్ గిట్ల ఇవ్వలే. ప్రస్తుతం రైతులకు ప్రభుత్వం నాణ్యమైన కరెంట్ ఇస్తుండడంతో తెలంగాణలో రైతుల విద్యుత్ మరణాలు తగ్గాయి. మోటర్లు కాలిపోవడం లేదు.
మేము మోటర్ వేసి ఐదేండ్లు కావస్తున్న ఇప్పటి వరకు ఎటువంటి రిపేరు కాలేదు. అందుకు కారణం లోవోల్టేజీ లేకుండా సరఫరా అందుతుండడమే.. రైతులకు అవసరమైనా త్రీఫేజ్ కరెంట్ ఇవ్వడమే కారణం. రైతుల కోసం గిట్ల పాటుపడిన ముఖ్యమంత్రులు ఎవరూ లేరు.. కేసీఆర్ ఒక్కరే. రైతుల విద్యుత్ మరణాలు తగ్గాయి.. రాత్రి వేళల్లో వారి కుటుంబంతో కలిసి హాయిగా నిద్రపోతున్నారు. – జార్జన్న, రైతు, జమ్మిచేడ్, జోగుళాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పాలనలో ధర్నాలే.. గద్వాల, నవంబర్ 7 : కాంగ్రెస్ కరెంట్ కోసం నిత్యం రోడ్లపై రైతులు ధర్నాలు చేసేటోళ్లు.. చివరకు నీరందక పొలాలన్నీ ఎండిపోయేవి. పెట్టుబడి కూడా అందక రైతు అప్పుల పాలయ్యేటోడు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే కరెంట్ తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని సీమాంధ్ర పాలకులు ఎగతాళి చేసిన మాటలు ఇంకా రాష్ట్ర ప్రజల చెవుల్లో గింగిరుమంటున్నాయి. వీటిని పటాపంచలు చేస్తూ తెలంగాణ ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల కరెంట్ను సరఫరా అందించారు. దీంతో నాటి కష్టాలు రైతుకు మరెన్నడూ రాలేదు. కరెంట్ నిరంతరం ఉండడంతో ఎప్పుడైనా పొలాల వద్దకు వెళ్లి బోర్లను ఆన్ చేసి నీటిని పంటచేళ్లకు పారిస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతుబాంధవుడిలా కర్షకులకు వెన్నుదన్నుగా నిలిచారు. నిరంతరం కరెంట్ వెలుగులతో రైతన్న సంబురంగా సాగు చేపట్టాడు.