మిరప సాగు అంటే రైతులకు ఎంతో మమ‘కారం’. సిరుల దిగుబడి.. మార్కెట్లో మద్దతు ధర లభిస్తుండడంతో సాగుకు కర్షకులు మొగ్గు చూపుతున్నారు. గతంలో అలంపూర్ నియోజకవర్గంలో 10 నుంచి 15 వేల ఎకరాల్లో సాగయ్యేది. తుమ్మిళ్ల ఎత్తిపోతలతో సాగునీరు పుష్కలం కావడంతో విస్తీర్ణం పెరిగింది. ఇక్కడ నల్లరేగడి పొలాలు అనువుగా ఉండడంతో ప్రస్తుతం దాదాపు 20 నుంచి 30 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతున్నది. ఏటేటా విస్తీర్ణంతోపాటు దిగుబడి పెరగడంతో సిరుల పంట పండుతున్నది. దీంతో కర్ణాటకలోని బెంగళూరు, బేడిగి, హసన్, బళ్లారితోపాటు ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పలు గ్రామాల నుంచి ఏపీ, కర్ణాటకకు భారీగా మిర్చి ఎగుమతి అవుతున్నది. కాగా రెండు నెలల కిందట క్వింటా ధర రూ.40 వేల నుంచి రూ.60 వేలు ఉండగా.. నేడు ఆశాజనంగా పలుకుతున్నది. దీంతో పంటను కోల్డ్స్టోరేజీల్లో నిల్వ ఉంచారు.
– మానవపాడు, ఏప్రిల్ 20
మానవపాడు, ఏప్రిల్ 20 : సాగునీరు పుష్కలంగా ఉండడంతో ఎటు చూసినా పచ్చని పంటపొలాలే దర్శనమిస్తున్నాయి. దీంతో రైతన్న పంట పండుతున్నది. బీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన ఎనిమిదేండ్లల్లో పంట ఉత్పత్తులు పెరగడం, గిట్టుబాటు ధర రావడంతో అన్నదాత మోములో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు.. సీఎం కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గ రైతులకు తుమ్మిళ్ల లిఫ్ట్తో సాగునీరు అందిస్తున్నారు. దీంతో రైతన్నలు సంబురంగా సాగు చేపడుతున్నారు. ఈ ఏడాది రైతులు ఎక్కువగా మిర్చి పంటను సాగు చేశారు. నల్ల రేగడి పొలాలు అనువుగా ఉండడం, సాగు నీరు సమృద్ధిగా అందుతుండడంతో రైతులు మిర్చి పంట వేశారు. అయితే, మార్చి వరకు గిట్టుబాటు ధర బాగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు కాస్త తగ్గింది. దీంతో రైతులు శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉం చుకుంటున్నారు. గిడ్డంగుల్లో బ్యాంకు లోన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
గతంలో అలంపూర్ నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల ఎకరాలలోపే మిర్చి సాగు చేసేవారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా సాగునీరు పుష్కలంగా అందుతుండడంతో రెండేండ్లుగా సాగు విస్తీర్ణం పెరిగింది. 20 వేల నుంచి 30 వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. రానున్న రోజుల్లో అలంపూర్ ప్రాంతం కోనసీమగా మారనున్నది. నల్ల రేగడి పొలాలు అనువుగా ఉండడంతో గుంటూరు తేజ, సింజంట బేడిగ, కేడీఎల్ బేడిగ, సూపర్ 10 రకాలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇందులో కేడీఎల్ బేడిగ రకం మిర్చి విత్తనాలకు క్వింటాకు రూ.40 వేలు, సింజంట బేడిగ రకం రూ.32 వేలు, గుంటూరు రకం రూ.17 వేల వరకు పలుకుతున్నది. దీంతో ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. బేడిగ రకం మిర్చి పంటను బెంగళూరు, బేడిగి, హసన్, బల్లారి ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. గుంటూరు రకాల పంటను కొనుగోలు చేసేందుకు ఏపీ, బెంగళూరు, రాజస్థాన్, హర్యాన వ్యాపారస్తులు పోటీ పడడంతో మార్కెట్లో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్కెటింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో దళారుల ప్రమేయం లేదు. చీడపీడల కారణంగా ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గినా.. ధరలు పెరగడంతో రైతన్నలకు ఊరటనిస్తున్నది. దీంతో రైతులు కల్లాల్లోనే మిరప పంటను విక్రయిస్తున్నారు.
దిగుబడి తగ్గినా ధర వస్తున్నది..
ఈ ఏడాది మొదటి నుంచి పంటకు వాతావరణం అనుకూలించలేదు. డిసెంబర్ చివర నుంచి అనువుగా ఉన్నది. పంట దిగుబడి తగ్గినప్పటికీ.. మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తున్నది. ఇతర ప్రాంతాలకు వెళ్లి విక్రయించుకునే అవసరం లేకుండా వ్యాపారస్తులు ఇక్కడకే వస్తున్నారు. కళ్లాల్లోనే పంటను అమ్ముతున్నాం. దీంతో రవాణా కష్టాలు తప్పాయి.
– రాముడు, రైతు, మానవపాడు
పుష్కలంగా సాగునీరు..
ఆర్డీఎస్ ద్వారా సాగునీరందక ఇబ్బందు లు పడ్డాం. మూడేండ్లుగా తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వా రా సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పంటలకు సరిపడా నీరు రావడంతో ఈ ఏ డాది మంచిగా పండింది. మార్కెట్లో మంచి ధర లభించింది. మా కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే ఇదంతా జ రుగుతున్నది. సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
– కొంకల రాముడు, రైతు, మానవపాడు