ఊట్కూర్,(కృష్ణ) మార్చి 30 : అప్పుల బాధ భరించలేక కౌలు రైతు కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లా కృష్ణ మండలం వాసునగర్ వద్ద చోటు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు ఆంధ్రా ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్య నాగరాజు (56) ముప్ఫై ఏండ్ల్ల కిందట కృష్ణానది పరివాహక ప్రాంతం గుడెబల్లూర్ వద్ద నివాసం ఏర్పరుచుకున్నాడు. నది పరివాహక ప్రాంతంలోని రైతుల వద్ద పొలాలను కౌలుకు తీసుకొని వరి, బొప్పాయి, మునగ తోటలను సాగు చేస్తున్నారు.
రెండు, మూడేళ్లుగా వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడులు చేతికి అందకపోవడంతో రూ.లక్షల్లో అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో వ్యవసాయం వదిలి ఏడాదిగా పాల వ్యాపారం చేస్తున్నాడు. అప్పులు ఇచ్చిన యజమానుల నుంచి తీవ్రమైన ఒత్తిడులు రావడంతో గత్యంతరం లేక ప్రైవేట్ పనులు చేసేందుకు భార్య బిడ్డలను వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లాడు. ఈక్రమంలోనే నివాసం ఉంటున్న సొంత ఇంటికి సైతం రైతు అమ్ముకున్నాడు. బంగారం తాకట్టు పెట్టి కొంత వరకు అప్పులు తీర్చాడు. అయినప్పటికీ అప్పులు ఇచ్చిన యజమానుల నుంచి ఒత్తిడులు ఎక్కువ రావడంతో రెండురోజుల కిందట గ్రామానికి చేరుకున్నాడు.
ఇదే క్రమంలో రైతు తీవ్ర మనస్తాపంతో సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో కృష్ణానది బ్రిడ్జి పైకి చేరుకొని నదిలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. కాగా, కృష్ణానదిలో నీటి ప్ర వాహం పూర్తిగా తగ్గి రాళ్లు, రప్పలు తేలిపోవడంతో తలకు బలమైన గా యం తగిలి ఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కృష్ణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఒడ్డు కు చేర్చారు. అనంతరం మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జరిగిన ఘటనపై మృతుడి భార్య సంధ్యారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు. రైతు కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకొని తగిన న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.