పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సాహిత్యవేత్త, తెలంగాణ ఉద్యమనాయకులు జలజం సత్యనారాయణ (82) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకుడిగా పనిచేసిన జలజం విద్యారంగంపై ఉన్న మమకారంతో లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ ను, న్యూ విజన్ జూనియర్ కళాశాలను స్థాపించారు. పలు హిందీ, ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి అనువదించారు.
జలజం సత్యనారాయణ మరణం పట్ల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎన్. గోపి, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు ఆచార్య బన్న అయిలయ్య, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు, ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కె.లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, డాక్టర్ ఎస్. విజయకుమార్, డాక్టర్ గుంటి గోపి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. జలజం మరణం సాహిత్యలోకానికి, విద్యారంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం జలజం అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.
జలజం సత్యనారాయణ మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధించారు.
కవిగా, రచయితగా, విద్యావేత్తగా, శ్రామికవర్గ పక్షపాతిగా జిల్లాకు వారు అందించిన సేవలు అమూల్యమైనవని, మాజీ ప్రధానమంత్రి వాజ్ పాయ్ కవిత్వం.. శిఖరం పేరుతో తెలుగులో అనువదించడంతో పాటు, కబీర్ గీత, ఫైజ్ మహ్మద్ గ్రంథాలు తెలుగు వారికి అందించారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యా, సాహిత్య రంగాలలో వారి కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.