బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నలు భగ్గుమంటున్నారు. 10 హెచ్పీ బోరు మోటర్లను వాడితే ఎన్ని ఎకరాలకైనా నీరు పారించవచ్చని చెబుతున్న ఉచిత సలహాలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికల ముందే ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుండటంతో తర్వాత సంగతేమిటని గ్రామాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఏ రైతు ను కదిలించినా వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెన్ హెచ్పీ మోటర్లు ఒకేసారి న డిస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయని, సబ్స్టేషన్లలో బ్రేక్డౌన్లు ఖాయమని ఎలక్ట్రిసిటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అంటున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో హస్తం ప్రభుత్వ పాలన కళ్లారా చూస్తున్న అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. అయితే తెలంగాణలోనూ పాగా వేయాలని కుట్ర రాజకీయం చేస్తుండడంతో తగిన బుద్ధి చెబుతామని ఇక్కడి కర్షకులు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. అసలు వ్యవసాయం గురించి తెలుసా? ఏ రైతయినా పది హార్స్పవర్ మోటర్ ఎందుకు పెట్టుకుంటాడా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు అధికారం అప్పగించామా.. ఇక మా బతుకులు ఆగమే అని ఆలోచన చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగ్గా ఉండేది కాదు. తోటి రైతులతో కలిసి పొలాల వద్ద కరెంటు కోసం పడిగాపులు కాసెటోళ్లం. లోఓల్టేజీతో వచ్చే కరెంటు ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి. పారిన చోటే పారుతూ నీళ్లు ముందుకు కదలని పరిస్థితి. కాంగ్రెస్ నేతలు మూడు గంటల విద్యుత్ చాలు.. 10 హెచ్పీ మోటర్లతో వ్యవసాయం చేసుకోవచ్చని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నది. ఆ మోటర్లతో వ్యవసాయం చేస్తే కరెంటు సరిపోక మోటర్లు కాలిపోయి ట్రాన్స్ఫార్మర్లు పేలే అవకాశం ఉంటుంది. బోరుబావులలో ఉన్న నీళ్లు కాస్త అయిపోయి ఖాళీ మోటర్లు తిరగడం తప్పా నీళ్లుపోయవు. ఇలాంటి పనులకు పూనుకుంటే రైతులు నిండా మునగడం ఖాయం. మళ్లా కాంగ్రెస్ వస్తే రైతులకు కాలరాత్రులే మిగులుతాయి. నేను మూడెకరాల్లో వరి పంట సాగు చేస్తున్నాను. గతంలో సాగు చేసిన పంటలకు నీటి తడులు అందించేందుకు రాత్రిళ్లు సైతం మోటర్ వద్ద నిద్ర చేసేవాడిని. కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియక ఇబ్బంది పడేవాడిని. ఒక వైపు ఎండిపోతున్న పంటను చూసి కన్నీళ్లొచ్చేవి. బీఆర్ఎస్ సర్కారు వచ్చాక 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు సరఫరా చేస్తున్నారు. కరెంటు సమస్య తీర్చిన సీఎం కేసీఆర్కు రైతుల పక్షాన ధన్యవాదాలు.
అయ్యా.. చాలా రోజుల నుంచి ఎన్నో పార్టీలు వచ్చినాయ్.. పోయినాయ్.. గిప్పుడు జర్ర మంచిగా జరుగుతుంది.. జరగనివ్వండయ్యా. కాంగ్రెసోల్లు గిప్పటికే ఎన్నో యేండ్లు పాలించిండ్రు. గప్పుడు ఎలక్షన్లకు కనిపించినోళ్లు మళ్లీ ఎలక్షన్లలో కనిపిస్తుండ్రి. గిప్పుడు మళ్లీ లొల్లి లొల్లి పెడుతుండ్రు. గిదేం పద్ధతి. ఇది పద్ధతే కాదు. గిప్పుడు ఏ రైతు అయినా కరెంట్ లేక నా చేను ఎండిపోయింది అని అంటున్నాడా? గది జర్ర ఆలోచన చేయాలి. ఏవో మాట్లాడుతారు.. 3 గంటల కరెంట్, 10 హెచ్పీ మోటర్ అంటే ఏం కరెంట్ ? ఏమి మాట్లాడుతారు ? 10 హెచ్పీ మోటర్తో భూమిలో ఎన్ని నీళ్లు ఉంటాయ్.. ఎంత పారబెడుతాం. నాకు 2 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేసినా.. గిప్పుడూ చేస్తున్నాను. నాకు పెరాలసిస్ వచ్చింది. ఆసరా పింఛన్ వస్తుంది. జర్ర పానం మంచిగా ఉన్నది. భూమికి రైతు బంధు వస్తుంది. అప్పుడు పంటలు పండక ఆటో నడిపి ఎన్నో ఇబ్బందులు పడి నా ముగ్గురు ఆడ బిడ్డలకు, ఒక కొడుకును పెద్దగా చేసి పెళ్లి చేసిన్నా. గిప్పుడు చాలా నిమ్మలంగా ఉంది. మయమాటలను ఎవరూ నమ్మేది లేదు. ప్రజలూ నమ్మడం లేదు. అందరూ కారు గుర్తు అంటున్నారు. మంచిగా చేసినోళ్లను బాగ చేసిండ్రు అనకపోతే ఎలా ? బీఆర్సోళ్లు అందరినీ మంచిగా చూసుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే ఇక కరెంట్ కోసం రోజంతా ఎదురు చూడాల్సిందే. గతంలో వ్యవసాయం కోసం మోటరు పంపుసెట్లు పనిచేయక, సింగిల్ఫేజ్ కరెంట్తో బావుల వద్ద ఎన్నో తిప్పలు పడ్డాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ ఫుల్లుగా ఉంటున్నది. సీఎం కేసీఆర్ సారు పుణ్యాన కరెంట్ కష్టాలు తీరాయి. 24 గంటలు విద్యుత్ ఇస్తున్నారు. నాకు 7 ఎకరాల భూమి ఉన్నది. పొద్దున్నే పొలం కాడ మోటరు చాలు చేసి వస్తే సాయంత్రానికల్లా చెలక మొత్తం పారుతది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి అది చేస్తాం. ఇవి చేస్తమని గొప్పలు చెప్పుకుంటుండ్రు. వారి మాటలను నమ్మితే మోసపోతం. ఆగం పట్టిస్తరు. మూడు గంటల కరెంట్ ఇస్తే ఏ మూలన పారుతది. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాతరోజులే. తిరిగి కేసీఆర్ సర్కారే రావాలి. సారే సీఎం కావాలి.
పదేండ్ల కిందట కరెంట్ కష్టాలు గుర్తొస్తే కన్నీళ్లు ఆగడం లేదు. రాత్రిపూట పొలం వద్దకు పోయి పడుకుంటే ఎప్పుడు ఏమవుతుందో అనే భయం ఉంటుండె. కాంగ్రెస్ కాలంలో రాత్రివేళ కరెంట్ కూడా సరిగా ఉండకపోయేది. ఒకవేళ వచ్చినా ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. దీంతో తడిసిన వద్దే పొలం తడిసేది. నిద్రాహారాలు మానుకొని పొలం వద్దే కావలి కాసేవాళ్లం. అప్పటి కాలాన్ని తలుచుకుంటే చాలా భయమేస్తుంది. పొలం వద్ద పడుకున్నప్పుడు పాములు, తేళ్లు ఎక్కడ కాటేస్తాయోనని భయం భయంగా ఉండేది. రాత్రి పూట మోటర్లు పెట్టేటప్పుడు అక్కడక్కడ తేలిన వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోచేవారు. ఈ చావులను చూస్తే వ్యవసాయం చేయడమే మానుకోవాలనిపించేది. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కారు పాలనలో 24 గంటల కరెంట్ ఉంటున్నది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్లి పంటలకు నీళ్లు పారించుకుంటున్నాం. హాయిగా నిద్రపోతున్నాం.
వ్యవసాయానికి 10 హెచ్పీ మోటర్లను వినియోగించడం తెలివి తక్కువతనమే అవుతుంది. ఎందుకంటే అవి కాల్వలు ఉన్న ప్రాంతంలో మాత్రమే అవసరమవుతాయి. ఆ మోటర్లు వాడాలంటే నీళ్లు చాలా ఎక్కువగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా అలాంటి మోటర్ల వినియోగం అవసరమే ఉండదు. 10 హెచ్పీ మోటర్ ఒక్కసారి నడిస్తే నీళ్లను మొత్తం గుంజేస్తుంది. దీంతో నీళ్లు అందక పక్కనే ఉన్న పొలం వారితో పంచాయితీలు అవుతాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మా మధ్య మాకే చిచ్చు పెట్టేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచిస్తున్నాడు. ఉదాహరణకు.. 10 హెచ్పీ మోటర్ పక్కనే 5 హెచ్పీ ఉంటే.. 5 హెచ్పీ మోటర్ ఆగిపోతుంది. పనిచేయదు. నీళ్లు రావు. దీంతో చాలా గొడవలు జరుగుతాయి. ఇదంతా రేవంత్రెడ్డికి అవగాహన లేదనుకుంటా.. మన ప్రాంతంలో ఈ విధానం కరెక్ట్ కాదు.
మొకర్లాబాద్ గ్రామంలో మా బావ రాత్రి సమయంలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబానికి తీరనిలోటుగా మిగిలింది. మూడు గంటల కరెంటుతో రైతులకు మళ్లీ కరెంటు కష్టాలు వస్తాయి. ఇప్పడున్న పద్ధతి రైతులకు ఎంతో మేలుగా ఉంది. అవసరం ఉన్నప్పుడు చేనుకు పోయి కరెంట్ మోటర్లను పెట్టుకుంటున్నాము. ఇప్పడు రైతులకు కరెంటుపై ఎలాంటి సమస్యల్లేవు. రైతులందరూ యదార్థంగా పంటలను పండించుకుంటున్నారు. రాత్రికి పొలాలకు వెళ్లే బాధలు తప్పినాయి. మూడు గంటల కరెంటు సరిపోతుందని, 10 హెచ్పీ మోటర్తో పంటలు పండిపోతాయని టీపీసీసీ చీఫ్ చెప్పడం చూస్తే రైతులకు కరెంట్ కష్టాలు తెచ్చిపెట్టడానికి కుట్ర పన్నుతున్నారు. 10 హెచ్పీ మోటరు కొనుగోలు ఖర్చు ఎక్కువే.. మరి సామాన్య రైతుపై మరింత భారం పడడం ఖాయం. మూడు గంటల కరెంటులో అందరూ రైతులు ఒకేసారి మోటర్లు పెట్టుకుంటే ట్రాన్స్ఫార్మర్లపై భారం పెరిగి మళ్లీ, మళ్లీ కాలిపోతుంటాయి. వీటన్నింటికంటే ఇప్పడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న కరెంటుతోనే రైతులకు మేలు జరుగుతున్నది.