మహబూబ్నగర్, మార్చి 13 : ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్ రవినాయక్తో మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఉంటుందని, ఏర్పాట్ల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీరు, వైద్యసదుపాయాలు కల్పించాలన్నారు. ప్రశ్నపత్రాలను తీసుకెళ్లడం, తీసుకురావడంలో భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫ్లయింగ్ స్కాడ్ను ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దన్నారు. ఎక్కడైనా యాజమాన్యాలు హాల్టికెట్లు ఇవ్వనట్లయితే విద్యార్థులకు సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ప్రభుత్వం http:www.tsbie.cgg.gov.in వెబ్సైన్ను అందుబాటులో ఉంచిందన్నారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి నవీన్మిట్టల్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్నందున ముందుగానే ఆయా పరీక్ష కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల ఎక్కువమంది గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీరాక్స్ కేంద్రాలను మూసిఉంచాలని, సీసీటీవీలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల నిమిత్తం రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 040-246010,0402465527 నెంబర్లు 24 గంటలపాటు పనిచేస్తాయన్నారు. ఇటీవల టెలీమానస హెల్ప్లైన్ను వైద్యారోగ్యశాఖ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెలీమానస హెల్ప్లైన్ నెంబర్ 14416కు కూడా ఫోన్చేసి తెలియజేయాలన్నారు. ముఖ్యంగా డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర పరీక్షలకు సంబంధించి కూడా టెలీమానసను వినియోగించుకోవచ్చారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం : కలెక్టర్
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఇప్పటికే సంబంధిత శాఖల అధికారులతో జిల్లాస్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో 16 ప్రైవేట్ కళాశాలల్లో, 16 ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాట్లు చేశామన్నారు. అన్నిసెంటర్లలో సీసీ కెమెరాలు తదితర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మొత్తం 20,224మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇప్పటివరకు హాల్టికెట్లు తీసుకోని విద్యార్థులు నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్కు విద్యాశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి కరుణ హాజరయ్యారు. జిల్లాలో ఏఎస్పీ రాములు, డీఐఈవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్లు, వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, పోస్టల్ విద్యుత్ తదితరశాఖల అధికారులు పాల్గొన్నారు.