మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 15 : నిత్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే కేసీఆర్ రైతు పాలన కావాలా.. కాంగ్రెస్ పార్టీ నాయకుల రాక్షస పాలన కావాలా అని వ్యవసాయశాఖ మంత్రి, వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం, అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి, కన్మనూరు, పెద్దముగనల్చేడ్, చిన్నమునగల్చేడ్ తదితర గ్రామాల్లో మంత్రి సింగిరెడ్డి నరింజన్రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డికి ఆయా గ్రామాల్లో అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, పెద్దమందడి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణుయాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం ఫలికారు. మంత్రిని గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదని, ఆ పార్టీ నాయకత్వం మన పార్టీలో ఉన్న వారిని ఆ పార్టీలో చేర్పించుకొని ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు.
వారి మాయమాటలు నమ్మి ప్రజలు, నాయకులు మోసపోవద్దని కోరారు. మళ్లీ గెలిచేది బీర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, సీఎంగా కేసీఆర్ అవుతారన్నారు. మన పల్లెలను మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. తెలంగాణలో పేదరికమే లేకుండా చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో తన సంకల్పం ఇంకా నెరవేరలేదన్నారు. ప్రణాళికాబద్దంగా చేస్తున్న పరిపాలనతో అందరూ బాగుండాలన్నదే కేసీఆర్ సంకల్పమన్నారు. ఈసారి గెలిపొందిన తర్వాత ఉన్న పథకాలను పెంచుకోవడంతోపాటు, మరిన్ని మంచి పథకాలు అమలు చేస్తారని తెలిపారు. అభివృద్ధి కూడా రెట్టింపులో ఉంటుందన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలను నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. 55ఏండ్లు పాలించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని తెలిపారు. స్వరాష్ట్రంలో పదేండ్లలోనే రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.