మహబూబ్నగర్/మహబూబ్నగర్టౌన్/పాలమూరు, నవంబర్ 30 : మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో మొదటి ఓటు నమోదు అయింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలీస్ అధికారులతోపాటు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ పట్టణంలోని మెట్టుగడ్డ, పోలీస్లైన్, కలెక్టరేట్బంగ్లాతోపాటు మహబూబ్నగర్ రూరల్, హన్వాడ మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని ప్రత్యేకంగా పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండ ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. మహబూబ్నగర్ అర్బన్ మండలం దివిటిపల్లి, మున్సిపాలిటీ పరిధిలోని ఎదిర, అప్పన్నపల్లి, హౌసింగ్బోర్డు, ఎనుగొండ, శ్రీనివాసకాలనీ, పద్మావతికాలనీ, మెట్టుగడ్డ, పాల్కొండ, క్రిష్టయన్పల్లి, బీకేరెడ్డికాలనీ, బండమీదిపల్లి, షాసాబ్గుట్ట, న్యూటౌన్, మదీనమసీదు, వీరన్నపేట, వన్టౌన్, పాతపాలమూరు, గణేశ్నగర్, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో పట్టణ ఓటర్లు ఓటు వినియోగించుకున్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్ జిల్లా కేంద్రంలో పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ తాటిగణేశ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్హ్రెమాన్, ఆయా వార్డుల కౌన్సిలర్లు వారి వార్డులో ఓటు వేశారు. జిల్లా ఉన్నత అధికారులు ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించారు. మహబూబ్నగర్ రూరల్ మండలంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా పోలింగ్ సందర్భంగా గ్రామాల్లోకి ఓటు వేయడానికి ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. కొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం కొంత నిలకడగా వచ్చారు. మధ్యాహ్నం 3గంటల నుంచి ఓటర్లు మళ్లీ క్యూలైన్లు పెరిగాయి. సాయంత్రం ఆరుగంటల వరకు ఓటు వేశారు. పోలీస్ అధికారులు పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చర్యలు తీసుకున్నారు.
గండీడ్, నవంబర్ 30 : గండీడ్ మండలంలో ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. మండలంలో 37 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. వెన్నాచేడ్, పెద్దవార్వల్, రుసుంపల్లి, గండీడ్, కొంరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, సల్కర్పేట్, రంగారెడ్డిపల్లి, జానంపల్లి, తదితర గ్రామాల్లో ప్రజలు ఉదయం నుంచి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బల్సుర్గొండలో ఈవీఎంలు అరగంట పాటు మొరాయించడంతో ఓటర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాలార్నగర్ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నది. పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మండలంలో అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు.
మహ్మదాబాద్, నవంబర్ 30 : మండలంలోని అన్ని గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని 32 పోలింగ్ బూత్ల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మోరాయించిన అధికారులు మళ్లీ వాటిని సరి చేసి పోలింగ్ను కొనసాగించారు. మొకర్లబాద్, నంచర్ల, చౌదర్పల్లి తదితర గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల్లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల మహేశ్రెడ్డి మండలంలో పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అన్ని గ్రామాల్లో సుమారు 75 శాతం వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
హన్వాడ, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికలు మండలంలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటర్లు ఆయా పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తండాల్లో ఉన్న గిరిజనులను ఓటు వేసేందుకు ట్రాక్టర్లుతోపాటు వివిధ వాహనాల్లో తీసుకోచ్చి ఓటు వేయించారు. మండలంలోని కిష్టంపల్లిగేటు తండాలో గర్భిణిని అంబులెన్స్లో తీసుకోచ్చి ఓటు వేయించారు. బుద్దారం, గొండ్యాల, వేపూర్ గ్రామాల్లో 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. హన్వాడ, వేపూర్, పెద్దదర్పల్లి, గొండ్యాల, టంకర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు.
మహబూబ్నగర్, నవంబర్ 30 : పీయూలోని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల సాధారణ అధికారి సంజయ్కుమార్ మిశ్రా గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ రోడ్డు ఉన్నత పాఠశాలలో పోలిం గ్ ప్రక్రియను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండ పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.