ఊట్కూర్, మార్చి 21: తెలంగాణ వస్తే ఏమొస్తుందన్న వారికి రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే నిదర్శనమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో తాసిల్దార్ తిరుపతి అధ్యక్షతన నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెండ్లి జరిపేందుకు తల్లిదండ్రులు పడే కష్టాలను స్వయంగా తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్యాణలక్ష్మి పథకంతో రూ.లక్షా116వేలు అందజేస్తున్నట్లు తెలిపారు. నియోజవర్గంలో 600మంది కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులను ఎంపిక చేసి రూ.6కోట్లు నిధుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అధికారంలోకి వస్తే ఏటా 2కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పిన కేంద్రం గడిచిన తొమ్మిదేండ్ల పాలనలో ఒక్క ఉద్యోగ అవకాశమైనా కల్పించిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించి వారికి భారీగా జీతాలు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. బీఆర్ఎస్పాలన దేశానికి దిక్సూచి అని పేర్కొన్నారు. కేంద్రం పెంచిన బంగారం, నిత్యావసర వస్తువుల ధరలను సామాన్యులు అందుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతికుటుంబానికి సంక్షేమ పథకాలు
ప్రభుత్వం పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు రూ.3లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. సొంత జాగా ఉండి గుడిసెలో జీవితం గడుపుతున్న పేదలను గుర్తించి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. దళితబంధు పథకంతో ఈ ఏడాది నియోజకవర్గానికి 11 వందల యూనిట్లు మంజూరైట్లు తెలిపారు. త్వరలో లబ్ధిదారులను గుర్తించి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గొర్రెలకాపరుల సంక్షేమం కోసం ఏప్రిల్ 1నుంచి మూడో విడుత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ.270కోట్లు వడ్డీలేని రుణాలను విడుదల చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అరవింద్కుమార్, ఉప సర్పంచ్ ఒబేదుర్ రెహమాన్ పాల్గొన్నారు.
ఉద్యోగుల పక్షపాతి సీఎం కేసీఆర్
రాష్ట్రంలో అన్నివర్గాల ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచిన సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతిగా నిలిచారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో మంగళవారం మహిళా సమాఖ్యలో పని చేస్తున్న సెర్ఫ్ ఉద్యోగులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఉద్యోగులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, మహిళా సర్పంచులు శంకరమ్మ, యశోద, ఎంపీటీసీ పద్మ, ఐకేపీ ఏపీఎం నిర్మల, సీసీలు పాల్గొన్నారు.