మహబూబ్నగర్ : ధరణి పోర్టల్ లో వివిధ పారా మీటర్ల కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తహశీల్దారులను ఆదేశించారు.
సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి ధరణిపై తాహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సక్సేషన్ లో ఎక్కువ కేసులు పెండింగులో ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ కేసులలో వాస్తవాలు లేకుంటే తిరస్కరించాలని చెప్పారు.
అదేవిధంగా భూములకు సంబంధించిన ఫిర్యాదుల కేటగిరీలో పెండింగ్ కూడా ఎక్కువ ఉన్నాయని వాటిని కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పారు. ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న కేసులపై అదనపు కలెక్టర్లు, డీఆర్ఓ, ఆర్డీవోలు ప్రతి బుధ, గురు వారాలలో తాహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షించాలన్నారు.
తాహసిల్దారులు కూడా ధరణి దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, డీఆర్ఓ కె. స్వర్ణలత, ఆర్డిఓ పద్మశ్రీ ,సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, కలెక్టరేట్ ఏవో ప్రేమ్ రాజ్ తదితరులు హాజరయ్యారు.