తొర్రూరు, నవంబర్ 22 : మా తండాల్లో మా రాజ్యం నినాదాన్ని గౌరవాన్ని ఇస్తూ సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా ఏర్పాటు చేసి రాజ్యాధికారాన్ని కల్పించారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ అన్నారు. దయాకర్రావుకు మద్దతుగా బుధవారం తొర్రూరులో నిర్వహించిన తొర్రూ రు, పెద్దవంగర, రాయపర్తి మండలాల గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వారు మాట్లాడారు. తెలంగాణకు ముందు తండాల పరిస్థితి ఎలా ఉంది.. ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకోవాలన్నారు. నాడు కాలి బాటన వెళ్లాలనుకున్న కష్టాలు పడే పరిస్థితి, గొంతు తడుపుకోవడానికి తాగునీటికి తండ్లాట ఉండేదని, ఇప్పుడు తండాలకు పక్కా రోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాలు, ఇంటింటికీ నల్లాలు వేయించామన్నారు. విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఆనాడు కరెంటు, సాగునీరు లేక నానా ఇబ్బందులు పడ్డారని, పంటకు పెట్టుబడులు, విత్తనాలు లభించక, మద్దతు ధరలు లేక దుర్భర జీవితాలు గడిపిన రోజులు కాం గ్రెస్ ప్రభుత్వంలో ఉండేవన్నారు. నేడు రైతుబంధు, సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్తో పంటలు పండుతున్నాయని వివరించారు. 2009 కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని విస్మరించారని తెలిపారు.
ప్రతి తండా నుంచి 50 మందికి ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేలా ప్రణాళికలు రూపొం దిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. 10వ తరగతి చదివిన మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి, వారికి టెక్స్టైల్ పార్కుల్లో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మీరే నా బలం.. మీరిచ్చే ఆశీర్వదమే తనకు కొండంత ధైర్యం అని దయాకర్రావు చెప్పారు. కరోనా కాలంలో అందరికీ అండగా ఉన్నానని, అప్పుడు ఈ ఝాన్సీరెడ్డి, యశస్వినిరెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తన కోసం గిరిజనులంతా కలిసి పని చేయాలని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గిరిజనబంధును అమలు చేస్తామని తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, పేద మహిళలకు రూ.3 వేల భృతి, రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, రూ.5లక్షల వ్యక్తిగత బీమా, రైతుబంధు ఎకరానికి రూ.16 వేలకు పెంచబోతున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. మనమంతా సేవాలాల్, కొమురంభీం వారసులమని, ప్రజల కోసం పని చేసే దయాకర్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వారు మధ్యలో వచ్చారు.. ఎన్నికలు కాగానే వెళ్లిపోతారని ఆమె తెలిపారు. అనంతరం మంత్రులను గిరిజనులు సత్కరించారు. ధరావత్ రాజేశ్నాయక్, గాంధీనాయక్, కాలునాయక్, నెహ్రూనాయక్, నర్సింహానాయక్ పాల్గొన్నారు.