నీళ్లు నిండుగా ఉండడంతో ఎవుసం పండుగలా సాగుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రాజెక్టుల నుంచి సాగునీరు పుష్కలంగా అందుతున్నది. పక్కనే కృష్ణ, తుంగభద్ర పారుతున్నా సమైక్య పాలన లో నీటికి నోచుకోని చోట.. నేడు ఎటుచూసినా సాగునీరే దర్శనమిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నడిగడ్డ ప్రజలకు నీటి గోస తప్పింది. సీఎం కేసీఆర్ ప్రయత్నాలన్నీ సఫలం కావడంతో నడిగడ్డ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది. నెట్టెంపాడ్ ద్వారా 20 వేల ఎకరాలకు నీరందించాలని గత పాలకులు డిజైన్ చేయగా.. స్వరాష్ట్రంలో 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. గతంలో జిల్లాలో 97,186 ఎకరాలకు సాగునీరందగా.. ప్రస్తుతం అదనంగా 1,87,500 (మొత్తం కలిపి 2,84,686) ఎకరాల్లో పంటలు పండుతున్నాయి. దీంతో రెండు సీజన్లు కలిపి 2022-23లో 5,56,335 ఎకరాలు సాగయ్యాయి. దీంతో రైతన్నలు సంబురంగా ఉన్నారు.
గద్వాల, డిసెంబర్ 2 : ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి కోసం రైతన్నలు గోస అంతా ఇంత కాదు. నడిగడ్డ ప్రజలు అటు సాగు, ఇటు తాగునీటికి నోచుకోక నానా అవస్థలు పడ్డారు. సీమాంధ్రపాలనలో మన పాలకులు మంత్రులుగా ఉన్నా నీటి గోసపై మాట్లాడిన దాఖలాలు లేవు. ఆర్డీఎస్ నీటిని అటు కర్ణాటక, ఇటు సీమా్రంధ పాలకులు అక్రమంగా తరలించుకుపోతున్నా అడిగే వారు లేరు. ప్రాజెక్టులు కట్టి వదిలేశారు. కాల్వల నిర్మాణం జరగలేదు. దీంతో పంట పొలాలకు నీరు అందకపోయేది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్డీఎస్ రైతులు ఆగమయ్యారు. జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఏనాడు 33వేల ఎకరాలకు మించి నీరు అందలేదు. రాష్ట్ర ఏర్పాటుతో నడిగడ్డ ప్రజలకు నీటి గోస తప్పింది. తుమ్మిళ్ల, నెట్టెంపాడ్, గట్టు ఎత్తిపోతలతో గద్వాల జిల్లాలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేశారు. ప్రయత్నాలన్నీ సఫలం కావడంతో ప్రస్తుతం నడిగడ్డ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది. నీటి సౌలభ్యం పుష్కలంగా ఉండడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. కాంగ్రెస్ పాలనలో అడ్వాన్స్లు తీసుకుని పనులు నాణ్యతతో చేపట్టకపోవడంతో ర్యాలంపాడ్ రిజర్వాయర్ వద్ద లీకేజీలు అవుతున్నాయి. కాల్వలు అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రాజెక్టులు కట్టినా రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. ఆనాడు నెట్టెంపాడ్ ద్వారా 20వేల ఎకరాలకు నీరు అందించాలని ఇక్కడి పాలకులు డిజైన్ చేశారు. కానీ స్వరాష్ట్రంలో 1.60లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. గతంలో జిల్లాలో 97,186 ఎకరాలకు సాగునీరు అందగా ప్రస్తుతం అదనంగా 1,87,500 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దీంతో వలసలు ఆగిపోయి ఆంధ్ర, కర్ణాటక నుంచి కూలీలు ఇక్కడికి వలసొచ్చి పనులు చేసే పరిస్థితి నెలకొన్నది.
ఈ ప్రాజెక్టు కింద జిల్లాలోని 8 మండలాల పరిధిలో 141 గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. ఇప్పటివరకు రూ.2025కోట్లు ఖర్చు చేశారు. 2022-23 బడ్జెట్లో రూ.120కోట్లు కేటాయించారు. ఈ ఎత్తిపోతల నీటి లభ్యతను బట్టి 1.60లక్షల ఎకరాలకు నీటి విడుదల కొనసాగుతున్నది. రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.603కోట్లు విడుదల చేయగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పనులు పూర్తయితే రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందే
అవకాశం ఉన్నది.
గద్వాల నియోజకవర్గంలో బీడు, కరువు పీడిత ప్రాంతాలైన గట్టు, ధరూర్, కేటీదొడ్డి, మల్దకల్ మండలాల్లో 33వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈక్రమంలోనే ర్యాలంపాడ్ రిజర్వాయర్ నుంచి ఎత్తిపోతల ద్వారా 2.80 టీఎంసీల నీటిని తీసుకొని గట్టు ఎత్తిపోతల పథకం చేపట్టాలని రూ.581.06కోట్లకు పరిపాలన అనుమతినిచ్చింది. రూ.487.3కోట్ల పనులకు సాంకేతిక అనుమతి రాగా పనులు చకచకా నడుస్తున్నాయి. ఇలా ప్రాజెక్టుల ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తుండంతో నడిగడ్డ పచ్చని పైర్లతో కళకళలాడుతున్నది.
జోగుళాంబ గద్వాల జిల్లాలో 2014-15 వానకాలంలో 3,23,036 ఎకరాల్లో రైతులు సాగు చేయగా 2022-23 వానకాలానికి 4,01,887 ఎకరాలకు చేరుకున్నది. అదే ఏడాది యాసంగిలో 1,04,360 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా 2022-23 నాటికి 1,54,448 ఎకరాలకు పెరిగింది. 2014-15లో రెండు సీజన్లు కలిపి సాగువిస్తీర్ణం 4,27,397 ఎకరాలు కాగా 2022-23 నాటికి అది 5,56,335 ఎకరాలకు పెరిగింది. ఇది రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధించిన ప్రగతి.
రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలు ఉండేవి. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు విద్యుత్ కష్టాలు తప్పవని సీమాంధ్ర పాలకులు ప్రజలను భయభాంత్రులకు గురి చేశారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాణ్యమైన విద్యుత్ను అన్ని రంగాలకు 24 గంటలపాటు అందిస్తున్నారు. వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి నేడు దశదిశలా వ్యాపించింది. ప్రస్తుతం జిల్లాలో కరెంటు కోతలు, పవర్ హాలిడేలకు శాశ్వత ముగింపునిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర సృష్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా 2018 జనవరి 1 నుంచి 24గంటల ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చింది. గతంలో రోజుకు సరాసరి 16లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత అది 30లక్షల యూనిట్లకు పెరిగింది. దానికి తగ్గట్లుగా విద్యుత్లైన్లు, ఉపకేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాకముందు జిల్లాలో 33/11కేవీ ఉపకేంద్రాలు 34 మాత్రమే ఉండేవి. తెలంగాణ వచ్చాక అదనంగా 36 ఏర్పాటు చేయగా ప్రస్తుతం 58 సబ్స్టేషన్ల ద్వారా విద్యుత్ను అందిస్తున్నారు. మిగత వాటిలో పనులు జరుగుతున్నాయి.
జిల్లాలో నీటి సౌలభ్యం పెరగడంతో సాగు విస్తీర్ణం మరింత పెరిగింది. దీంతో ఇక్కడి వలసలు ఆగిపోయి ఆంధ్రా, కర్ణాటక ప్రాంతాల కూలీలు ఇక్కడికి వలసొచ్చి పనులు చేసుకుంటున్నారు. నడిగడ్డలో సీడ్ పత్తి సాగు ఎక్కువగా ఉండడంతో ఆగస్టు, సెప్టెంబర్లో ఇతర రాష్ట్ర కూలీలు ఇక్కడికొచ్చి పనులు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇతర రాష్ర్టాల నుంచి సుమారు 6-9వేల మంది కూలీలు ఇక్కడికొస్తుంటారు.
ఆర్డీఎస్ రైతులకు కాల్వలు సరిగ్గా లేక నీరు పూర్తిస్థాయిలో అందేది కాదు. ఆర్డీఎస్ ప్రధాన మేజర్ కాల్వ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.12.84కోట్లతో పనులు చేపట్టింది. దీంతోపాటు 2023-24 బడ్జెట్లో రూ.10కోట్లు కేటాయించింది. పనులు చేపట్టి 2023-24 యాసంగిలో 33,683 ఎకరాలకు, వానకాలంలో 55వేల ఎకరాలకు నీరందేలా ప్రతిపాదించారు.
తుంగభద్రానదిపై ఉన్న సుంకేసుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్ కాల్వ నుంచి డీ-24, డీ-40 వరకు ఉన్న 55,600 ఎకరాలకు అందించడమే లక్ష్యంగా తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిర్మించారు. మొదటి దశలో రూ.397కోట్ల పరిపాలన అనుమతితో రూ.159కోట్లతో పనులు పూర్తి చేశారు. ఇది 2018 జనవరిలో అందుబాటులోకి రాగా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు వరకు నీరు పారుతుండడంతో రైతులు సంబురపడుతున్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఏనాడూ 40వేల ఎకరాలకు మించి పారలేదు. దీంతో మిగతా ఆయకట్టు అంతా బీడుగా ఉండేది. తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటుతో మిగిలిపోయిన ఆయకట్టుకు నీరు అందుతున్నది.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కింద ఉన్న కుడి కాల్వ ద్వారా జోగుళాంబ గద్వాల జిల్లాలో 37,186 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. ఎడమ కాల్వ ద్వారా వనపర్తి ,నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 67,555 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. 2022-23 బడ్జెట్లో ప్రభుత్వం రూ.10కోట్లు కేటాయించింది. ఈ నిధులతో మిగిలిపోయిన పనులు చేపడుతున్నారు.